కాన్పూర్‌లో పోలీసులపై కాల్పులు..8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. 
 
రౌడీ షీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు డీఎస్పీ నేతృత్వంలో 16 మంది సిబ్బందితో కూడిన బృందం గురువారం రాత్రి కాన్పూర్‌ లోని చౌబేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డిక్రూ గ్రామానికి వెళ్లింది. అయితే అప్పటికే భవనంపై తుపాకులతో సిద్ధంగా ఉన్న వికాస్‌దూబే ముఠా సభ్యులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.
 
దీంతో ఎనిమిదిమంది పోలీసులు మరణించడంతోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. పోలీసులపై కాల్పులు జరిపిన క్రిమినల్స్‌ అక్కడి నుంచి పారిపోయారు. రౌడీషీటర్‌ వికాస్‌దూబేపై 60కిపైగా కేసులు ఉన్నాయి. 
 
కాల్పుల విషయం తెలుకున్న ఎస్‌ఎస్‌పీతోపాటు ఐజీ, ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పోలీసులు రౌడీముఠా కోసం గాలింపు చేపట్టారు. 
 
పోలీసుల మృతి ఘటనపై ముఖ్యమంత్రి  యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సానుభూతి తెలిపారు. కాల్పులకు పాల్పడిన నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థీని ఆదేశించారు.