ఫేస్‌బుక్‌కు అమెరికాలో గడ్డురోజులు   

తమ లాభాల కోసం విద్వేషపూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికాలో గడ్డురోజులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఒకరి  తరువాత మరొకరు అన్నట్లుగా పెద్ద. చిన్న ప్రకటనదారులు వరుసకట్టి మరీ ఫేస్‌బుక్‌కు ప్రకటనలు ఇవ్వమంటూ ప్రకటిస్తున్నారు. 
 
దానితో ఫేస్‌బుక్‌ మార్కెట్ విలువ నుంచి 56 బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఫేస్‌బుక్‌పై తిరుగుబాటు ఉద్యమం కాస్తా అక్కడి నుంచి ట్విట్టర్, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా చేరుకొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. 
 
అమెరికాలో పోలీసుల అదుపులో మరణించిన జార్జి ఫ్లాయిడ్‌ ఘటన అనంతరం సోషల్‌ మీడియాలో అవాంఛిత, విద్వేషపూరిత సమాచారానికి వ్యతిరేకంగా అమెరికాకు చెందిన ఫ్రీ ప్రెస్‌, కామన్ సెన్స్‌ సంస్థలు మానవ హక్కుల సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మొదలెట్టాయి. తాత్కాలిక హామీలు కాకుండా సమగ్ర విధానం తీసుకురావాలంటూ ఈ ఉద్యమ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
లాభాలు పొందేందుకు విద్యేషపూరిత సమాచారాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని అంటూ దీనికి నిరసనగా #stophateforprofit (స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌) పేరుతో ఈ నెల తొలివారంనుంచి ఉద్యమం ప్రారంభమైంది.  ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వకూడదని అమెరికాకు చెందిన 100 కుపైగా దిగ్గజ కంపెనీలు నిర్ణయించాయి. 
 
తమతో చేతులు కలుపాల్సిందిగా ఐరోపా‌కు కూడా ఉద్యమాన్ని  విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ‘స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్’ ప్రచారంలో భాగంగా బెన్ & జెర్రీస్, స్టార్‌బక్స్, కోకా కోలా, యూనీలీవర్‌, డియాజియో, హోండా, లెవిస్, మొజిల్లా, పెప్సి, ది నార్త్ ఫేస్, ది హెర్షే కంపెనీ, వైబర్ మరియు వెరిజోన్ వంటి  ప్రముఖ సంస్థలు ఫేస్‌బుక్‌కు ప్రకటనలు బహిష్కరించాయి. ఈ జాబితా రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. 
 
ప్రపంచంలో అతిపెద్ద ప్రకటనదారులలో ఒకరైన యూనీలీవర్‌ సంస్థ కూడా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించింది. యూనీలీవర్‌ గత ఏడాది అమెరికా ఫేస్‌బుక్‌లో 42.4 మిలియన్ డాలర్లను ప్రకటనల కోసం ఖర్చు చేసింది. ఒక్క యూనీలీవర్‌ ప్రకటన కారణంగా ఫేస్‌బుక్‌ తన ఆదాయంలో దాదాపు రూ.1,890 కోట్లను కోల్పోనున్నట్లుగా తెలుస్తున్నది.
 
తిరుగుబాటు రావడాన్ని గమనించిన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రకటన చేశారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లోని ప్రకటనల్లో విద్వేషపూరిత సంభాషణలను నిషేధిస్తామని, సోషల్ మీడియాపై దాడుల నుంచి హాని కలిగించే గ్రూపులను రక్షించే పోస్ట్‌లను కూడా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ విధానాలను ఉల్లంఘించే పోస్టులను లేబుల్ చేస్తామని చెప్పారు. 
 
కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనకు చెందిన కొన్ని పోస్టులను ట్విట్టర్‌ లేబుల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి తప్పుడు విధానాలను అవలంభిస్తే ట్విట్టర్‌ను బహిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు.