పీవోకేలో చైనా విమానాలు… భారత్ అప్రమత్తం  

చైనా భారత్ ను రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తున్నది. తాజాగా పీవోకేలోని స్కర్దూ వాయుసేన స్థావరంలో చైనా విమానాలు మోహరించారు. చైనాకు చెందిన ఐఎల్‌ 78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ నిఘా వర్గాలు స్కర్దూలో గుర్తించాయి. ఇది యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపగలదు. 

మరోవైపు తూర్పు లఢక్‌లోనూ చైనా  కార్యక్రమాలు పెరిగాయి. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భారత్‌- చైనా సైన్యాలు ఇంకా ముఖాముఖి నిలిచే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

చైనా కుట్రలను గమనించిన భారత్‌ కూడా డ్రాగన్‌కు దీటుగా సన్నద్ధమవుతున్నది. ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దుకు తరలించింది. అత్యవసరంగా 21 మిగ్‌-29 విమానాలు, 12 సుఖోయ్‌ విమానాలు కొననున్నట్టు తెలుస్తున్నది. 

కాగా, మిత్రదేశాలైన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలను బలోపేతం చేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌-2021కింద ఈ మూడు దేశాల యుద్ధ పైలట్లకు  శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు బిల్లును సెనేట్‌లో ఆమోదానికి పెట్టారు.

కశ్మీర్‌లో 2 నెలలకు సరిపడా సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం అక్కడి కంపెనీలను ఆదేశించింది. కార్గిల్‌ సమీపంలో ఉన్న గాందర్‌బల్‌ జిల్లాలో 16 పాఠశాల భవనాలను ఖాళీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా వీటిలో సీఏపీఎఫ్‌ బలగాలు ఉంటాయని చెప్పారు. 

మరోవంక, తూర్పు లఢక్‌లో ఇటీవల దుశ్చర్యకు పాల్పడిన చైనా.. వ్యూహాత్మక గల్వాన్‌ ప్రాంతంలో సాగించిన ఆక్రమణల, కవ్వింపుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  గల్వాన్‌ లోయలో చైనా పక్కా ప్రణాళికతోనే భారత్‌తో ఘర్షణకు దిగిందన్న వాదనలకు మరింత బలాన్నిచ్చే విషయాలను ఆ దేశ అధికార మిలిటరీ పత్రిక చైనా నేషనల్‌ డిఫెన్స్‌ న్యూస్‌ వెల్లడించింది. 

గల్వాన్‌ ఘటనకు కొద్ది రోజుల ముందే ఆ ప్రాంతానికి సమీపంలో పర్వతారోహకులు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులు చేరుకున్నారని తెలిపింది. జూన్‌ 15న టిబెట్‌ రాజధాని లాసాలో కొత్తగా 5 మిలీషియా బృందాలు మోహరించాయని పేర్కొన్నది.  కేవలం 33 రోజుల వ్యవధిలోనే గల్వాన్‌ నదీ పరీవాహకంలో డ్రాగన్‌ దేశం నిర్మించిన స్థావరాలు, సైనిక మోహరింపులు ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా బయటకు వచ్చాయి. 

మే 22 నుంచి జూన్‌ 26 మధ్య మాక్సర్‌, ప్లానెట్‌ ల్యాబ్స్‌ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ లోయ గుండా వాస్తవాధీన రేఖ వెళ్తున్నది.  ఇక్కడే జూన్‌ 15న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. 

ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ వైపు చర్చలు జరుగుతుండగా.. చైనా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గులాబీ రంగు టెంట్లు ఏర్పాటుచేసినట్లు, జవాన్లను మోహరించినట్లు జూన్‌ 22నాటి శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. జూన్‌ 25న తీసిన తాజా చిత్రాల్లో గులాబీ టెంట్ల స్థానంలో నలుపు రంగు టెంట్లు ఉన్నాయి. జవాన్లు లేరు. దీన్నిబట్టి చైనా బలగాలు వెనుదిరిగినట్లు  భావిస్తున్నారు.

కాగా, కరోనా మహమ్మారి, సరిహద్దుల వద్ద చైనాపై మోదీ ప్రభుత్వం ఏకకాలంలో యుద్ధం చేస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు  ఈ రెండింటిలో భారత్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.