ఎసిబోగీల్లోని ప్రయాణికులకు ఇకపై ఆపరేషన్ థియేటర్ లాంటి స్వచ్ఛమైన గాలిని అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఎసి బోగీల్లో ఈ మార్పులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఆపరేషన్ థియేటర్లలో పనిచేసే రూఫ్ మౌంటెడ్ ఎసి ప్యాకేజ్ యూనిట్ (ఆర్ఎంపియు) వ్యవస్థ మాదిరిగానే ఎసిబోగీల్లో కూడా గంటకు 16-18 సార్లు గాలిని రీప్లేస్ చేయనున్నట్లు తెలిపారు.
గతంలో ఎసి కోచ్లలో గంటకు ఆరు నుండి ఎనిమిదిసార్లు మాత్రమే గాలిని రీప్లేస్ చేసేవారని, దీంతో బోగీల్లో పునర్వినియోగపరిచిన గాలి 80 శాతం ఉండగా, స్వచ్ఛమైన గాలి 20 శాతం ఉండేదని చెప్పారు. అలాగే గంటకు ఎక్కువ సార్లు స్వచ్ఛమైన గాలిని పంపడంతో విద్యుత్ వినియోగం కూడా 10 నుండి 15 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు.
కాగా, విద్యుత్ వినియోగానికయ్యే అదనపు ఖర్చును ప్రయాణికులే భరించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన గాలిని ఎక్కువసార్లు రీప్లేస్ చేస్తుండటంతో బోగీలో వాతావరణం చల్లబడటానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంటుందని అధికారులు వివరించారు.

More Stories
రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు
కర్నాటక మంత్రి సతీశ్, ఎంపీ ప్రియాంకా ఇంట్లో ఈడీ సోదాలు
పొదుపు కంటే వేగంగా పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాల అప్పులు