రఘురామకృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసులు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాంటూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ తెలపాలంటూ నోటీసులు పంపించింది. వారంలోగా సమాధానం పంపాలని కోరింది. 
 
ఇటీవల కాలంలో రఘురామకృష్ణంరాజు వైసిపి నాయకత్వానికి, సిఎం జగన్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు గుప్పించారు. వివిధ అంశాల్లో వైసిపిని విమర్మిస్తున్న టిడిపి, బిజెపికి మద్దతుగా నిలిచారు. టిడిపి నేత అచ్చన్నాయుడు అరెస్ట్‌ను ఖండించారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు ఆయనపై ఫైర్‌ అయ్యారు. 
 
జగన్‌ ఫోటో పెట్టుకొని గెల్చిన నీవు ఎంపి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌ విసిరారు. దీనిపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తనంతటతానుగా టిక్కెట్‌ అడగలేదని, తనను బతిమిలాడి పార్టీలో చేర్చుకున్నారంటూ కౌంటర్‌ చేశారు. 
 
తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామాచేస్తే తాను పదవి వదిలేసి ఎన్నికలకు వస్తారని, ఎవరు గెలుస్తారో తేల్చుకుందామంటూ ప్రతి సవాల్‌ విసిరారు.