మొలకెత్తని కేసీఆర్ ప్రభుత్వ సోయా విత్తనాలు 

కేసీఆర్ ప్రభుత్వం  చేసిన సోయా విత్తనాలు నిజామాబాదు  జిల్లాలో చాలాచోట్ల మొలకెత్తలేదు. ప్రభుత్వ  సబ్సిడీతో సొసైటీల ద్వారా సోయా విత్తనాలు సరఫరా చేయగా రైతులు పది రోజుల కింద వేశారు. ఇప్పటివరకు మొలకలు కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం సరిపడ విత్తనాలు  ఇవ్వకపోవడంతో కొందరు ప్రైవేట్ డీలర్లవద్ద కొనుగోలు చేసి వేయగా అవి మొలకలు వచ్చాయి. 

ఈ వానాకాలం సీజన్‍లో ప్రభుత్వం మొక్కజొన్న బదులు సోయాపంట వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు జిల్లా వ్యవసాయ అధికారులు పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1.09 లక్షల ఎకరాల్లో సోయా వేయాలని నిర్ణయించారు. 

గత ఏడాది కంటే ఈసారి 42 వేల ఎకరాలను పెంచారు. పత్తిపంట కూడా వేసుకునే అవకాశం ఉన్నా చాలామంది సోయా పంట సులువుగా ఉంటుందని, మద్దతు ధర కూడా పెంచడంతో రైతులు మొగ్గుచూపారు. కానీ ప్రభుత్వం సరఫరా  చేసిన విత్తనాలు  వేసి మొలకెత్తకపోవడంతో నిరాశ చెందుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై సరఫరా  చేస్తున్న సోయా విత్తనాలు  టీఎస్ఎస్‍డీసీ, హెచ్‍ఏసీఏ(హాకా), ఎన్‍ఎన్‍సీ, మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్‍ ఏజెన్సీల ద్వారా జిల్లాలో సింగిల్ విండో, సొసైటీల ద్వారా సరఫరా చేస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు  కావడం, సబ్సిడీ పోనూ మార్కెట్ రేటు కన్నా తక్కువకు లభిస్తుండడంతో చాలామంది రైతులు కొనుగోలు చేశారు. కానీ అవి మొలకెత్తక పోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వ సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో నిరాశ చెందిన రైతులు భూమిని మరోసారి దున్నించి ప్రైవేట్  వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్లో బాహుబలి, కరిష్మా, సంపత్‍, ఈగల్ రకాలను కొంటున్నారు. కాగా, ప్రభుత్వం సరఫరా  చేసిన 30 కిలోల సోయా విత్తనాల  బస్తా ధర రూ.1,190 ఉంది. బయటి మార్కెట్లో బస్తాకు రూ. 2,550 నుంచి రూ.2,700 ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.