చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణం   

తూర్పు లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌ – చైనా సైనికుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారడంతో సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారితో సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందినట్లు ఆర్మీ అధికారులు దృవీకరించారు. ఈ ఘటనలో 17 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

ఘర్షణలో చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించి ఉండవచ్చని తెలిసింది. అయితే చైనా సైనికులు 10 మంది మృతి చెందినట్లు పీటీఐ సమాచారం అందిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని భారత్‌ – చైనా ప్రకటించినా ఘర్షణలు చోటుచేసుకొంటున్నాయి.

మే 5వ తేదీ నుంచి చిన్నగా ప్రారంభమైన ఈ ఘర్షణ సోమవారం రాత్రి తీవ్రరూపం దాల్చి రెండు దేశాల సైనికులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కొట్లాటలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌తో సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

1975 తరువాత భారత్‌ – చైనా సరిహద్దులో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. సరిహద్దు వద్ద చైనాకు చెందిన హెలికాప్టర్లలో తమ సైనికుల మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు, గాల్వాన్‌లోయ, దౌలత్‌బేగ్‌ ఒలిడి ప్రాంతాల్లో చైనా గస్తీ ఎక్కువ కావడాన్ని గమనించిన భారత సైన్యం అప్రమత్తమైంది. 

 గాల్వన్‌ ఘర్షణతో భారత్‌ అప్రమత్తమైంది.  లడఖ్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసింది. ఘటనపై త్రివిధ దళాల అధిపతులు, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో రక్షణ, విదేశాంగ మంత్రులు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని ప్రధాని మోదీకి మంత్రులు వివరించారు. రాత్రి పొద్దుపోయేవరకు మంత్రులు అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. 

ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన హోంమంత్రి అమిత్‌షా తాజా పరిస్థితిని వివరించారు. చైనాలో భారత రాయబారి విక్రం మిస్తీ, ఆ దేశ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని విదేశాంగశాఖ ప్రతినిధి ప్రకటించారు. మరోవైపు గాల్వన్‌ లోయ తమదేనని, ఎప్పటికీ చైనా సార్వభౌమత్వంలోనే ఉంటుందని ఆ దేశ సైన్యం ప్రకటించింది. 

దేశం యావత్తు ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తున్నా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఈ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని ప్రకటించారు.