పాల్గర్ లో సాధువుల హత్యలో  నక్సల్ తరహా శక్తులు 

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా గడిచించలే గ్రామంలో ఏప్రిల్ 16న ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్ హత్యలకు గురికావడానికి ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న నక్సల్ తరహా శక్తులు కారణమని ఆ సంఘటనపై ముంబైలోని వివేక్ విచార మంచ్ నియమించిన వాస్తవ  నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ఈ సంఘటనపై  ఎన్ ఐ ఎ లేదా సిబిఐ తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. 

ముంబై హై కోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అంబదాస్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికను నేడు విడుదల చేశారు. భారత ఆర్ధిక రాజధాని ముంబైకి సమీపంలోని ఈ ప్రాంతంలో కొంతకాలంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు కొన్ని శక్తులు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. వారే సాధువుల హత్యకు బాధ్యులని స్పష్టం చేశారు 

గడ్చిరోలి, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న విధంగా తమ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాల వారిని హింసాయుత చర్యల ద్వారా నిర్ములించడం వంటి సంఘటనలు పాల్గర్ ప్రాంతంలో కూడా సాగించడానికి గత  నాలుగు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. 

ఆ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలలో సాధువుల హత్య ఒక చిన్న సంఘటన మాత్రమే అంటూ వారి వెనుక ఉన్న శక్తులు, సంస్థలు; వారు పాల్గర్, థానే జిల్లాల్లో సాగిస్తున్న కార్యకలాపాల గురించి లోతయిన దర్యాప్తు జరపవలసిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ఆయా సంస్థల మూలాలు, వారికి లభిస్తున్న నిధులు, విదేశాలతో వారికున్న సంబంధాలను కూడా కనుగొనాలని స్పష్టం చేసారు. 

ఈ సంఘటనలో ఇప్పటి వరకు ఆదివాసీయులను మాత్రమే అరెస్ట్ చేసారని చెబుతూ నిజమైన నేరస్థులను అరెస్ట్ చేసి, అమాయకులను విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. వారి నివేదికలో ప్రధాన అంశాలు: 

* కాసా పోలీస్ స్టేషన్ లోని పోలీసులు అందరిని బదిలీ చేయడం, వారిలో ఐదుగురిని సస్పెండ్ చేయడంతో ఈ సంఘటనలో పోలీస్ యంత్రాంగం పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. 

* ముఖ్యమంత్రి, రాష్ట్ర హోమ్ మంత్రి ఈ సందర్భంగా ఇచ్చిన ప్రకటనలు పోలీస్ దర్యాప్తును ప్రభావితం చేసేవిధంగా ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు అక్కడనే ఉన్న అధికార పార్టీకి చెందిన కాశీనాథ్ చౌదరి సాధువులను కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా అక్కడ గుంపులో ఉన్న చాలామందిని అతనే తీసుకు వచ్చిన్నట్లు అనుమానం కలుగుతున్నది. వారిలో అనేక మంది హోమ్ మంత్రి గడిచించాలె పర్యటనలో పాల్గొన్నారు. దానితో రాష్ట్ర పోలీస్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు. 

* ఇతర రాష్ట్రాలకు చెందిన వామపక్షాలకు చెందిన సంస్థలు పాల్గర్ జిల్లాలోని గిరిజనులతో సాగిస్తున్న  పనుల గురించి దర్యాప్తు  జరుపవలసి ఉంది. లేని పక్షంలో గడ్చిరోలి లేదా ఇతర నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో వలే ఈ ప్రాంతంలో కూడా హింసాయుత సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది.