ఉగ్రవాదుల నుండి రూ 100 కోట్ల హెరాయిన్ సీజ్

కాశ్మీర్ పోలీసులు పాకిస్తాన్ ప్రోద్భలంతో జరుగుతున్న  నార్కో–టెర్రర్ మాడ్యూల్ ను అడ్డుకున్నారు. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదిలను హంద్వారా పోలీసులుఅరెస్టు చేసి, వారి దగ్గరి నుంచి 21 కిలోల నాణ్యమైన హెరాయిన్, రూ.1.34 కోట్లు, డబ్బులు లెక్కించే మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.100 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.

 ‘‘ఈ ముగ్గురూ పాకిస్తాన్ లోని హ్యాండ్లర్స్ తో టచ్ లో ఉన్నారు. వీరిని ప్రముఖ డ్రగ్ స్మగ్లర్ ఇఫ్తికర్ ఇంద్రాబీ, మామిన్ పీర్ అల్లుడు, ఇక్బాల్ ఉల్ ఇస్లామ్ గా గుర్తించాం. ఈ మాడ్యూల్ లో మరికొందరు కూడా ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం” అని హంద్వారా ఎస్పీ జీవీ సందీప్ చక్రవర్తి చెప్పారు.

 ‘‘ఈ ముగ్గురూ డ్రగ్స్ అమ్ముతూ, లష్కరే తోయిబాకు ఆర్ధికంగా అండగా ఉంటున్నారు. ఇదో పెద్ద హవాలా రాకెట్. మనీ మూవ్ మెంట్ లేకుండానే మనీ ట్రాన్స్ ఫర్ అయిపోతుంటుంది” అని ఎస్పీ చెప్పారు. ఉగ్రవాదులపై కేసులు నమోదు చేశామని, దీనిపై పూర్తి విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.