క‌రోనాతో ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్‌  

దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రధాన కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. అందులో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో లోక్‌నాయక్‌ భవన్‌లో ఉన్న ఈడీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

కరోనా నిర్ధారణ అయినవారితో సన్నిహితంగా మెలిగిన పది మందికిపైగా సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. ఈడీ అధికారుల కుటుంబ సభ్యుల్లో కొంత మందికి కూడా కరోనా సోకిందని సమాచారం. శానిటైజేషన్‌ నేపథ్యంలో రెండు రోజులపాటు కార్యాలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు.

ఢిల్లీలో ఇప్పటిరవకు 26334 కరోనా కేసులు నమోదవగా, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9887 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 2,36,657 కరోనా కేసులు నమోదవగా, 6642 మంది మరణించారు.