
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1974-77 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 1980-1986, 1986-89 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయ నాయకుడిగా తన అర్ధ శతాబ్దపు జీవితంలో, అనేక పార్టీలలో చేరారు. పశ్చిమ యుపిలోని బాగ్పత్ నుండి వచ్చిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ టికెట్పై ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో, చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్దళ్ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసింది.
కానీ 1984లో, ఆయన కాంగ్రెస్లో చేరారు, అది ఆయనను 1986లో రాజ్యసభకు పంపింది. బీజేపీలో చేరిన తర్వాత 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను బీహార్ గవర్నర్ గా పంపింది. కొద్దికాలం ఒడిశా గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ఆయనను జమ్మూ కాశ్మీర్ కు, అక్కడి నుండి గోవా, మేఘాలయాలకు పంపారు. క్రియాశీల రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, బహిరంగంగా మాట్లాడే వ్యక్తిగా పేరుగాంచిన ఆయన వివాదాలకు కొత్తేమీ కాదు.
2019 పుల్వామా దాడిపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సత్యపాల్ మాలిక్పై కిష్టార్లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కోసం పటేల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన ఫైల్ను ఆమోదించేందుకు రూ.300 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సత్యపాల్ మాలిక్పై సీబీఐ చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది.
More Stories
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ