ప్రయాణికుడి తలపైనుంచి లగేజీ పడిపోవడంతో ఢిల్లీ తొక్కిసలాట

ప్రయాణికుడి తలపైనుంచి లగేజీ పడిపోవడంతో ఢిల్లీ తొక్కిసలాట
తలపై పెద్ద లగేజీ మోస్తున్న ఓ వ్యక్తి కింద పడిపోవడంతోనే గందరగోళం జరిగి ఈ ఏడాది కుంభమేళా యాత్రికుల రద్దీతో డిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన జరిగిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తులో తేలిన విషయాలను కేంద్ర మంత్రి ఓ లేఖ ద్వారా వెల్లడించారు.

డిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, రాత్రి 8.15 గంటల తర్వాత బాగా అధికమైంది. చాలామంది ప్రయాణికులు తలపై మూటలతోనే స్టేషన్‌కు వచ్చారు. రైల్వే స్టేషన్‌లోని 14,15 ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లే మెట్లపై ఓ ప్రయాణికుడి తలపై పెట్టుకున్న భారీ లగేజీ తోపులాట కారణంగా కిందపడింది. దీంతో అదుపుతప్పిన ఆ వ్యక్తి పక్కనే ఉన్న ప్రయాణికులపై పడిపోయాడు. 

క్షణాల్లోనే ఒకరిపై ఒకరు పడటం వల్ల గందరగోళం తలెత్తింది. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ గుర్తించిందని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2.5లక్షల చొప్పున పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా సమయంలో ఫిబ్రవరి 15న దిల్లీ రైల్వేస్టేషన్‌లోని 14, 15 నంబర్‌ ప్లాట్‌ఫాంలపై ఈ దర్ఘటన జరిగింది. 

కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్దఎత్తున యాత్రికులు రావటం వల్ల రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయింది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి రావటం వల్ల తొక్కిసలాట జరిగింది. సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్​ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, నార్తర్న్ రైల్వే ప్రన్సిపల్ చీఫ్​ సేఫ్టీ కమిషనర్ పంకజ్​ గంగ్వార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.