లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లలిత్‌ మోదీకి ఈడీ రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ, ఆ మొత్తాన్ని బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్ట్​లో పిటిషన్‌ను వేశారు. 

అయితే లలిత్ మోదీ వేసిన ఈ పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే, చట్టం ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు లలిత్‌ మోదీకి ఉంటుందని, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్​ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈడీ తనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను బీసీసీఐ చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ లలిత్‌ మోదీ గతేడాది డిసెంబర్‌లో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆఫీస్‌ బేరర్లు అధికారిక విధుల్లో ఉన్నప్పుడు సమస్య వస్తే, అందుకు ఆ సంస్థే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని లలిత్​ మోదీ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  అందువల్ల తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలకమండలికి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగిన దానికి, వ్యక్తిగతంగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన వేసిన పిటిషన్‌లో అర్థం లేదని పేర్కొంటూ బాంబే హైకోర్టు దానిని కొట్టివేసింది.

పైగా జరిమానాగా రూ.1లక్ష చెల్లించాలని లలిత్‌ మోదీని ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్‌ మోదీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన 2010లో లండన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆయనను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది.