‘రా’ చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్

‘రా’ చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్

భారత వెలుపల నిఘాలో కీలకమైన ‘రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌’ (రా) చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌  నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్‌ జైన్‌ను నియమిస్తూ నియామకాల క్యాబినెట్‌ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన `ఆపరేషన్ సిందూర్’లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్‌కు తెరవెనుక ఇంటెలిజెన్స్ మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించారు. గగనతల ఉపగ్రహ ఫోటోలు విశ్లేషణ, డ్రోన్ మార్గ సూచనలు వంటి అంశాల్లో ఆయన దిశానిర్దేశం చేశారు.  జులై 1న పరాగ్ జైన్ రా చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. 

పరాగ్‌ జైన్‌ 1989 బ్యాచ్‌ పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం జైన్.. ‘రా’ గగనతల నిఘా, టెక్నికల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏవియేషన్ రిసెర్చ్ సెంటర్ (ఎఆర్సీ) ప్రధాన అధికారిగా ఉన్నారు. అదేవిధంగా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్‌ తన వంతు పాత్రను సమర్థవంతంగా  నిర్వర్తించారు. పరాగ్ జైన్ నేతృత్వంలో ఎ ఆర్ సి- రా  సంయుక్తంగా పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను గుర్తించి దాడులకు కీలక సహాయం చేశారు .భారత–పాక్ సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ లో అత్యంత కీలక పరిస్థితుల్లో అనుభవం కలిగిన నాయకుడు.

1989 బ్యాచ్ పంజాబ్ కేడర్‌ ఐపీఎస్ అధికారి అయిన జైన్ పంజాబ్‌లో ఖలీస్థాన్ ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో  ఎస్ఎస్‌పీ, డిప్యూటీ ఐజీగా సేవలందించారు. అలాగే, రాలో పాకిస్థాన్ డెస్క్, జమ్మూ కశ్మీర్ విభాగం, శ్రీలంక, కెనడాలో ఇండియన్ మిషన్లలోనూ సేవలందించారు. ప్రత్యేకించి ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్‌లోనూ, కెనడాలో ఖలిస్థాన్ మాడ్యూల్స్ పై నిఘాలో కీలక పాత్ర పోషించారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఆపరేషన్ బాలాకోట్ నిర్వహించినప్పుడు రా తరఫున జమ్మూకశ్మీరులో పరాగ్ విధులు నిర్వర్తించారు. కెనడా, శ్రీలంకలలో పలు మిషన్లను ఆయన విజయవంతం చేశారు. భారత్‌కు పదేపదే హెచ్చరికలు చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదుల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కెనడాలో రా తరఫున ప్రత్యేక మిషన్‌ను పరాగ్ అమలుపరిచారు. భారత్‌లోని ఇరుగుపొరుగు దేశాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది.