
మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వర్షాకాలంలో కూడా నక్సల్స్ ఏరివేత కొనసాగుతుందని, మార్చి 2026లోగా నక్సల్స్ను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఆయుధాలు వదలిన వారిని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు.
రెండు రోజుల పర్యటన సందర్భంగా పలు కీలక పనులకు శంకుస్థాపన ఆయన ఈ మేరకు ఛత్తీస్గఢ్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఈ వర్షాకాలంలోనూ వాటికి విరామం ఇవ్వబోమని అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నదులు పొంగడం కారణంగా దట్టమైన అడవుల్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ను నిలిపివేస్తుంటామని, ఈ సారి మాత్రం అలా చేయబోమని చెప్పారు.
ఛత్తీస్గఢ్లో విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకుపోతుందని, నక్సల్స్ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించారని అమిత్ షా ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను వేగవంతం చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు దానికి మార్గనిర్దేశం చేస్తూ వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆకర్షణీయమైన లొంగుబాటు విధానాన్ని ప్రకటించిందని చెబుతూ దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్కు వస్తున్నాని పేర్కొంటూ ఛత్తీస్గఢ్ను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్ అటల్ నగర్లో మూడు నూతన కార్యక్రమాలకు అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పనులు ప్రారంభించారు. వాటితో పాటు ఎన్ఎఫ్ఎస్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్, ఛత్తీస్గఢ్-ఐహబ్ కూడా ప్రారంభించారు.
ఎన్ఎఫ్ఎస్యూ క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమిని కేటాయించిందని, దీన్ని కేంద్రం రూ. 400 కోట్లతో నిర్మిస్తుందని ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. 6 నుంచి 7 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఆకాష్ రావ్ కుటుంబ సభ్యులను షా కలువనున్నారని తెలిపారు.
More Stories
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు … ఇద్దరు ఎన్కౌంటర్
ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అభ్యర్థులకు ట్రంప్ ప్రచారం!