ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై బండి సంజయ్ అసంతృప్తి

ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై బండి సంజయ్ అసంతృప్తి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న సిట్ దర్యాప్తు తీరుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారని, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన ఆయనకు “రాచమర్యాదలు” చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుమ్మక్కును స్పష్టం చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్‌రావు అండ్ కోను కాపాడే ప్రయత్నాలు చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చే ముందు కేటీఆర్ అమెరికాకు వెళ్లడం వెనక ఏదో మతలబు ఉందని తెలిపారు. అమెరికాలో ప్రభాకర్‌రావుతో కేటీఆర్‌ మాట్లాడిన తర్వాతే భారత్‌కు వచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు
 
ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని చెప్పిందే తాను అని సంజయ్ గుర్తు చేశారు. హైదరాబాద్‌, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని, అప్పటి ఎస్​ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు చాలా మంది‌ జీవితాలు నాశనం చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. 
 
పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకిషన్‌ చెప్పారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఈ స్టేట్​మెంట్​ను అనుసరించి కేసీఆర్, కేటీఆర్‌కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసలీ వ్యవహారం వెనక వీరిద్దరు ఉన్నారని  ఆరోపించారు. సీఎంవోను అడ్డాగా చేసుకుని ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే పేపర్ లీక్ కేసులో తనను అరెస్టు చేశారని స్పష్టం చేశారు.
 
“నేను మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపిస్తూనే ఉన్నాను. హైదరాదాద్​, సిరిసిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకనే ప్రణీత్​ రావు తప్పించుకున్నాడు. ఆయన వల్ల ఎంతోమంది కార్యకర్తల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రణీత్​రావు, ప్రభాకర్​రావు, రాధాకిషన్​ అనేక పార్టీల కార్యకర్తల జీవితాలతో ఆడుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు” అని సంజయ్ విమర్శించారు.