అన్నా యూనివర్సిటీ అత్యాచారం కేసులో 30 ఏళ్ళు జైలు

అన్నా యూనివర్సిటీ అత్యాచారం కేసులో 30 ఏళ్ళు జైలు
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో చెన్నై కోర్టు సోమవారంనాడు నిందుతుడైన జ్ఞానశేఖర్‌ను దోషిగా ప్రకటించి, అతనికి జీవిత ఖైదు విధించారు. కనీసం 30 సంవత్సరాలైన జైలు శిక్ష అనుభవించాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. నేర తీవ్రతను ప్రస్తావిస్తూ జడ్జి ఎం.రాజలక్ష్మి ఈ తీర్పును ప్రకటించారు. ఘటన జరిగిన ఐదు నెలల్లోనే ఈ కేసులో తీర్పు వెలువడటం విశేషం. 
 
భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్‌మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్‌పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది. దీంతో అతన్ని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. సోమవారంనాడు కోర్టు తీర్పు నేపథ్యంలో అతన్ని జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు.

అన్నా వర్సిటీ వద్ద బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్‌ గత ఏడాది డిసెంబర్ 23వ తేదీ రాత్రి క్యాంపస్‌లోకి చొచ్చుకొచ్చి విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా చాటుగా మొబైల్ ఫోన్ నుంచి దానికి రికార్డు చేశాడు. దానిని లీక్ చేస్తానని, విద్యార్థిని తండ్రి, కాలేజీ అధికారులకు పంపుతానని బెదరించాడు. 

అక్కడున స్నేహితుడిని కొట్టి ఆ విద్యార్థినిని సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె ఐడీ కార్డు, తండ్రి ఫోన్ నెంబర్ ఫోటోలు తీసుకుని, తనను కలుస్తూ ఉండమని, లేదంటే వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడు.కాగా, ఈ ఘటనతో విద్యార్ధిలోకం భగ్గుమంది. రాజకీయ విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో కేసును సిట్‌కు అప్పగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 

నిందితుడు డీఎంకేతో సంబంధాలున్నందున కేసు జాప్యం చేస్తున్నారంటూ విపక్ష నేతలు విమర్శలకు సైతం దిగారు. ఈ క్రమంలో నిందితుడిపై ఫిర్యాదు నమోదైన 24 గంటల్లోనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బలమైన సాక్ష్యాలు కూడా సంపాదించడంతో 5 నెలల్లోనే కేసు విచారణ పూర్తయి నిందితుడిని దోషిగా కోర్టు ప్రకటించింది.

కాగా, ఈ కేసులో కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయని, ఈ నేరంలో ప్రమేయమున్న వారిని కూడా శిక్షించాలని ఏఐడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. జ్ఞానశేఖర్‌ తన ఫోనులో ఎవరినో ‘సర్’ అని సంబోధించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని, ఆ సార్ ఎవరో తేలాలని స్పష్టం చేశారు.  దీనిపై చెన్నై పోలీస్ చీఫ్ ఎ.అరుణ్ వెంటనే వివరణ ఇచ్చారు. జ్ఞానశేఖరన్ తన ఫోన్‌ను  ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచి, ఎవరితోనే మాట్లాడుతున్నట్టు నటించాడని, ఈ కేసులో ఇతర అనుమానితులెవరూ లేరని తెలిపారు.