ముంబై టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇంట్లో రూ. 32 కోట్లు జప్తు

ముంబై టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇంట్లో రూ. 32 కోట్లు జప్తు
ముంబైలోని హైదరాబాద్ కు చెందిన ఓ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి యాదగిరి శివకుమార్‌రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. అతడికి సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా అరచేతి మందం కలిగిన భారీ బంగారు బిస్కెట్లు చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు.  ముంబైలోని వసాయివిరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరి శివకుమార్‌రెడ్డికి చెందిన ముంబై, హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలో రూ. 9.04 కోట్ల నగదు, రూ. 23.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సహా రూ.32.29 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్‌, ఏపీలోని కర్నూలుతో పాటు 13 చోట్ల వైఎస్‌ రెడ్డికి చెందిన నివాసాల్లో జరిగిన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని మిరబయందర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, డంపింగ్‌యార్డు కోసం కేటాయించిన స్ధలాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. 
 
ఈ క్రమంలో కొన్నాళ్లుగా వైఎస్‌ రెడ్డికి చెందిన బంధువులు, సన్నిహితులపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ దాడులు నిర్వహించి స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వీవీఎంసీలో 2009 నుంచి అక్రమ నిర్మాణాల కుంభకోణం జరుగుతున్నది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కలిసి 41 అక్రమ నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో పెద్దఎత్తున అక్రమ కట్టడాలు వెలిశాయి. 
 
ఈ నేపథ్యంలో 41 అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 2024 జూలై 8న బాంబే హైకోర్టు ఆదేశించింది. ఆయా భవనాల యజమానులు సుప్రీంకోర్టులో సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా ఊరట దక్కలేదు. దీంతో గత ఫిబ్రవరి 20న అక్రమ కట్టడాలను వీవీఎంసీ కూల్చివేసింది. భవనాల కూల్చివేత తర్వాత వాటి యజమానులు తమకు భూములు, భవనాలు అమ్మిన బ్రోకర్లు, బిల్డర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. 
 
కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ఇదొక పెద్ద కుంభకోణమని గుర్తించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అక్రమ నిర్మాణాల వెనుక స్థిరాస్తి వ్యాపారులు సీతారామ్‌గుప్తా, అరుణ్‌గుప్తా, టౌన్‌ప్లానింగ్‌ అధికారి శివకుమార్‌రెడ్డి పాత్రను గుర్తించారు. వీరిలో శివకుమార్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని గుర్తించిన ఈడీ అధికారులు బుధ, గురువారాల్లో ముంబై, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు చేశారు.
 
గతంలో వైఎస్‌ రెడ్డి శివసేన కార్పొరేటర్‌ ధనుంజయ గౌడ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా 2016లో థానే అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో వైఎస్‌ రెడ్డికి చెందిన ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 11 అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, 9 వ్యవసాయ భూములను గుర్తించారు. అప్పట్లో వీటి విలువ రూ.80 లక్షలు ఉండొచ్చని థానే ఏసీబీ అధికారులు ప్రకటించారు.