పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్యకు బిఎల్ఏ మద్దతు!

పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్యకు బిఎల్ఏ మద్దతు!
చర్చల తర్వాత పాకిస్తాన్ పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే, దానికి తాము మద్దతు ఇస్తామని పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం సంచలన ప్రకటన చేసింది. సోమవారం పాకిస్తాన్ తో భారత్ చర్చలు జరపనున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది. భారతదేశానికి సైనిక శక్తిగా నిలుస్తామని, పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌పై దాడి చేస్తామని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ శాంతి, కాల్పుల విరమణ ప్రకటనలను మోసంగా అభివర్ణించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య అని పేర్కొంది. పాకిస్తాన్ మాటలకు బలైపోవద్దని, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద కర్మాగారంగా అభివర్ణించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పేర్కొంది.

పాకిస్తాన్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత కొనసాగుతాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. పాకిస్తాన్‌పై దాడి చేయాలని నిర్ణయించుకుంటే పశ్చిమ సరిహద్దు నుండి సైనిక మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.

కాగా, భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య సోమవారం చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు, తదుపరి పరిస్థితుల గురించి చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. హాట్‌లైన్‌ వేదికగా జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ మిలటరీ ఆఫరేషన్స్‌ (డీజీఎంవో)లు పాల్గొంటారు. 

 
కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు తొలుత పాకిస్థాన్‌ డీజీఎంవో నుంచి భారత డీజీఎంవోకు హాట్‌లైన్‌ కాల్‌ వచ్చింది. ఈ సందర్భంగా పాక్‌ వైపునుంచి కాల్పుల విరమణ అంశానికి సంబంధించి ప్రతిపాదన వచ్చింది. దానిపై భారత్‌ సానుకూలంగా స్పందించడంతో కొద్దిగంటల్లోనే ఒప్పందం అమల్లోకి వచ్చింది.