ఐపీఎల్‌లో 14 ఏండ్ల బాలుడి విధ్వంసక శతకం

ఐపీఎల్‌లో 14 ఏండ్ల బాలుడి విధ్వంసక శతకం
బడి ఈడు కూడా దాటని పసివాడు వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) ఐపీఎల్‌-18లో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏండ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బీహార్‌ చిచ్చరపిడుగు.. జైపూర్‌లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపు బాట పట్టింది. 
 
వైభవ్‌ విధ్వంసక శతకానికి తోడు యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్థ శతకంతో రెచ్చిపోగా, గుజరాత్‌ టైటాన్స్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.

210 పరుగుల భారీ ఛేదనలో దిగిన రాజస్థాన్​కు అదిరే ఆరంభం దక్కింది. నాలుగో ఓవర్లో అసలైన విధ్వంసం మొదలైంది. ఇషాంత్ శర్మ వేసిన ఈ ఓవర్లో వైభవ్ సూర్య విధ్వంసమే సృష్టించాడు. రెండు వైడ్లు సహా ఈ ఓవర్లో 28 పరుగులు వచ్చాయి. సీనియర్ ఇషాంత్ బౌలింగ్​లో వైభవ్ ఏ మాత్రం బెదరలేదు. తొలి రెండు బంతుల్లో రెండు సిక్స్​లు ఆ తర్వాత 4-0- 6- 4 వచ్చాయి.  ఇక సుందర్ వేసిన 5వ ఓవర్లో 21 రన్స్ బాదాడు. 

వైభవ్- జైస్వాల్ విధ్వంసానికి ఆరు ఓవర్లలోనే 87 రన్స్​ చేసింది. ఈ క్రమంలోనే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ధనాధన్ బౌండరీలతో రఫ్పాడించాడు. 8 ఓవర్లలోనే స్కోర్ 108కి చేరింది. ఇక 10వ ఓవర్లో వైభవ్ అసలు షో చూపించాడు.  కరీమ్ జనత్ వేసిన ఈ ఓవర్లో 3 ఫోర్లు, 3 సిక్స్​లు సహా 30 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లోనే సిక్స్​తో 35 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇక 11.5 వద్ద వైభవ్ ఔటైనా అప్పటికే రాజస్థాన్ విజయం ఖాయమైంది. మిగిలిన పనిని పరాగ్​ (32) పూర్తి చేశాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. వైభవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 

రాజస్థాన్‌ గత ఐదు మ్యాచ్‌ల ప్రదర్శనతో పాటు గుజరాత్‌ బౌలర్ల జోరు చూస్తే రాయల్స్‌కు ‘ఈ మ్యాచ్‌ కూడా గోవిందా!’ అనుకున్నారంతా. కానీ ఇటీవలే 18 ఏండ్లు నిండిన ఐపీఎల్‌ కంటే తక్కువ వయసున్న వైభవ్‌ జైపూర్‌లో టైటాన్స్‌ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, వాషింగ్టన్‌, రషీద్‌ ఖాన్‌ వంటి బౌలర్లను క్లబ్‌స్థాయి బౌలర్లుగా మార్చేసి జైపూర్‌లో పరుగుల సునామీని సృష్టించాడు. 

మ్యాచ్ లో వైభవ్‌ 101 పరుగులు చేస్తే అందులో సిక్సర్లు, బౌండరీల రూపంలోనే ఏకంగా 94 పరుగులు వచ్చాయంటే బంతిని అతడు ఎంత కసిగా బాదాడో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్‌ తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన వైభవ ఇషాంత్‌ శర్మ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4, 6, 4తో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 

వాషింగ్టన్‌ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు, ఓ బౌండరీతో 17 బంతుల్లోనే ఐపీఎల్‌లో అతడు తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్‌, జైస్వాల్‌ జోరుతో పవర్‌ ప్లేలోనే రాయల్స్‌ 87/0గా నిలిచింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అఫ్గాన్‌ బౌలర్‌ కరీమ్‌ జన్నత్‌ ఓవర్లో అయితే బాదుడును వైభవ్‌ మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 4, 4, 6తో ఏకంగా 30 రన్స్‌ రాబట్టి 90లలోకి వచ్చాడు. 

రషీద్‌ 11వ ఓవర్లో రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌తో 35 బంతుల్లోనే అతడి తొలి శతకం పూర్తయింది. సెంచరీ తర్వాత వైభవ్‌.. ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయినా జైస్వాల్‌.. సారథి రియాన్‌ పరాగ్‌ (32*) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 209-4 స్కోర్ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (84), సాయి సుదర్శన్‌ (39) తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం జోడించారు. జోస్‌ బట్లర్‌ (50) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2, ఆర్చర్, సందీప్ శర్మ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

టీ20లలో అత్యంత పిన్న వయసులో శతకం చేసినవారిలో వైభవ్‌ (14 ఏండ్ల 32 రోజులు)దే తొలిస్థానం. మహారాష్ట్రకు చెందిన విజయ్‌ జోల్‌ (18 ఏండ్ల 118 రోజులకు) రికార్డును వైభవ్‌ బ్రేక్‌ చేశాడు. ఐపీఎల్‌లో వైభవ్‌ది రెండో అత్యంత వేగవంతమైన శతకం. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ తరఫున ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ వైభవ్‌దే.