సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌కు సుప్రీం మందలింపు

సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌కు సుప్రీం మందలింపు
 
స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు మందలించింది. స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది. స్వాతంత్య్ర సమరయోధుల గురించి బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని మందలించింది. అలాగే, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లైంది.

చరిత్ర, జియోగ్రఫీ తెలుసుకోకుండా స్వాతంత్ర్య సమరయోధులపై ప్రకటనలు చేయడం సరికాదని జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీని తప్పుపట్టింది. రాహుల్ చేసిన ప్రకటన శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ న్యాయవాది ఒకరు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు లక్నో బెంచ్ ఆయనకు సమన్లు జారీ చేసింది.  

సావర్కర్‌పై గతేడాది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లఖ్​నవూలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టు సమన్లు పంపింది. ఈ సమన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏప్రిల్ 4న రాహుల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. 

2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన భారత్ జోడో యాత్రలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సావర్కర్ బ్రిటిషర్స్ సేవకుడు, వారి పెన్షనర్ అంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీంతో సావర్కర్‌ను ఆయన ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే న్యాయవాది లక్నోలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ వాఖ్యలలపై జస్టిస్ దత్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైస్రాయ్‌కు మహాత్మా గాంధీ రాసిన లేఖల్లో కూడా ‘యువర్ ఫేత్​ఫుల్ సర్వేంట్’ అనే పదాన్ని ఉపయోగించారని, అలాగని, మహాత్మా గాంధీని బ్రిటిష్ సేవకుడు అని పిలవవచ్చా? అని ప్రశ్నించారు. ‘ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాసిన విషయం మీ క్టైంట్​కు తెలుసా?’ రాహుల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని జస్టిస్ దత్తా అడిగారు

. ‘సావర్కర్​ ఏమైనా రాజకీయ నాయుకుడా? మహారాష్ట్రకు వెళ్లి ఒక ప్రకటన చేస్తారా, అక్కడ ఆయన్ను పూజిస్తారు. ఇంకోసారి ఇలా చేయొద్దు’ అని జస్టిస్ దత్తా మందలించారు. స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన వారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలను తాము అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. భవిష్యత్​లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న షరతుపై ఇప్పుడు స్టే విధిస్తున్నట్టు చెప్పారు.