టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలే… అవినీతి ప్రభుత్వాలే 

టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలు అనేది వాస్తవమని, రెండు ప్రభుత్వాలలో అవినీతి జరుగుతూనే ఉన్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 21కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులపై అధ్యయనం చేసి.. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు.
 
సెంటు స్థలం పేరుతో పట్టాల పంపిణీ అంటూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేశారని ఆరోపిస్తూ,  దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.  ప్రభుత్వాన్ని నిలదీయరా అంటే.. అప్పుడు వాళ్లు..‌ ఇప్పుడు వీళ్లు అవినీతిలో భాగస్వామ్యులే అని ఆరోపించారు. 
నీరు..‌చెట్టు పేరుతో కోటి మొక్కలు పెంచేస్తామని ప్రగల్భాలు పలికారని,  ఇందులో కూడా‌ వేల కోట్ల అవినీతి జరిగిందనేది‌ వాస్తవమని వీర్రాజు ధ్వజమెత్తారు.  పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్దాంతం‌ చేస్తుందని మండిపడ్డారు.  తమకు టీడీపీ, వైసీపీ అయినా రెండూ ప్రతిపక్ష పార్టీలే అని స్పష్టం చేశారు. తమ పార్టీకి ఒక‌విధానం ఉందని..  ఆ విధానం బట్టే చానల్స్ డిబేట్లకి పంపిస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ, జనసేనలు కలిసి త్వరలో ప్రజా ఉద్యమం చేపడతామని సోమువీర్రాజు వెల్లడించారు.
 
అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ కంటే తమ బీజేపీ స్పష్టమైన  వైఖరితో ఉందని సోమువీర్రాజు తెలిపారు. రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను‌ చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని విమర్శించారు. 
 
ఎయిమ్స్‌ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మాణం చేసి చూపించిందని గుర్తు చేశారు. ఆనాటి, నేటి‌ ప్రభుత్వాలు కనీసం రోడ్‌కు స్థలం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాజధాని‌ విషయంలో టీడీపీ, వైసీపీలే ప్రజలను మోసం చేశాయని మండిపడ్డాయిరు. హైకోర్టు రాయలసీమలో ఉండాలని బీజేపీ విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
 
చంద్రబాబు రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం కూడా గొప్పలు‌చెప్పుకోవడం తప్ప..‌ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన దుయ్యబట్టారు. 
 
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా చంద్రబాబును విశాఖ పిలిపించి నిధులపై‌ చర్చించారని అంటూ అన్ని పార్టీల జాతకాలు‌ చెప్పే  లగడపాటి రాజగోపాల్రెం పదేళ్లు ఎంపీగా దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేక పోయారని విమర్శించారు. 
 
కేశినేని నాని‌ ఒక లేఖ ఇవ్వగానే గడ్కరీ స్పందించి ఫ్లైఓవర్లకు నిధులు ఇచ్చి పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి డిపాజిట్ సొమ్ములు తీయవద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. వరదలపై  సాయం‌ చేయాలని లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించిందని తెలపారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని,  రాష్ట్ర అభివృద్ధికే తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.