సీఎం విజ‌య‌న్ కుమార్తెపై విచార‌ణ‌కు కేంద్రం అనుమతి

సీఎం విజ‌య‌న్ కుమార్తెపై విచార‌ణ‌కు కేంద్రం అనుమతి
కేర‌ళ ముఖ్యమంత్రి పిన‌రయి విజ‌య‌న్ కుమార్తె టీ వీణా విజ‌య‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది. న్యాయ విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్ర కార్పొరేట్ వ్య‌వహారాల శాఖ ఆ ఆదేశాలు జారీ చేసింది. 
 
కొచ్చిన్ మిన‌ర‌ల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వీణా విజ‌య‌న్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ కంపెనీకి అక్ర‌మ రీతిలో డ‌బ్బులు బ‌దిలీ అయిన‌ట్లు తేలింది. సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసు దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా కేసు విచార‌ణ‌కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కొచ్చిలోని ఆర్థిక నేరాల‌ను పరిశీలించే ప్ర‌త్యేక కోర్టులో ఈ కేసు దాఖలు అయ్యింది.

సీఎంఆర్ఎల్‌, ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ మ‌ద్య అక్ర‌మ రీతిలో ఆర్థిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు అనుమానించారు. 2017 నుంచి 2020 మ‌ధ్య కాలంలో సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి ఎటువంటి సేవలు అందించకుండానే వీణా విజ‌య‌న్‌కు చెందిన కంపెనీ సుమారు 1.72 కోట్లు బ‌దిలీ అయ్యాయి. దీంతో ఈకేసులో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎస్ఎఫ్ఐఓ ఆదేశాలు జారీ చేసింది.

ఎస్ఎఫ్ఐఓ త‌న ఛార్జ్‌షీట్‌లో వీణా విజ‌య‌న్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ‌శిథ‌ర్ కార్తా, మ‌రో 25 మంది నిందితుల పేర్ల‌ను చేర్చింది. ఒక‌వేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. కంపెనీస్ యాక్టు ప్ర‌కారం ఆ శిక్ష ఉంటుంది. దీంతో పాటు పెనాల్టీ విధిస్తారు. 

అక్ర‌మంగా వ‌సూల్ చేసిన మొత్తంపై మూడు రెట్ల జ‌రిమానా వ‌సూల్ చేయ‌నున్నారు. కంపెనీస్ యాక్టులోని సెక్ష‌న్ 447 ప్ర‌కారం ఆరోప‌ణ‌లు చేశారు.  160 పేజీల ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో, ఎస్ఎఫ్ఐఓ వీణా,  సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్త, మరో 25 మందిని నిందితులుగా పేర్కొంది.  సీఎంఆర్ఎల్, ఎక్సలాజిక్ సొల్యూషన్స్, దాని అనుబంధ సంస్థ ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో సహా అనేక కంపెనీలు కూడా జాబితాలో ఉన్నాయి.

వీణా అనుబంధ సంస్థ నుండి నిధులను దుర్వినియోగం చేసిందని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ, “ముఖ్యమంత్రి కూతురిగా వీణా విజయన్ కంపెనీ ఎటువంటి సేవ అందించకుండా రూ. 2.7 కోట్లు పొందింది. ఈ పరిస్థితిలో, అవినీతికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. 

పినరయి విజయన్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడం సముచితం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూనే తన కుమార్తెపై కేసు నమోదు చేయడాన్ని ఆయన ఎలా సమర్థించగలరు? అని ప్రశ్నించారు.