తాజాగా ద వీక్ వారపత్రికలో రాసిన ఓ కథనంలో ఎంపీ థరూర్ కరోనా మహమ్మారి వేళ కేంద్ర సర్కారు చేపట్టిన టీకా దౌత్యంను మెచ్చుకున్నారు. అంతర్జాతీయ నాయకత్వానికి ఇదో శక్తివంతమైన ఉదాహరణ అని ఆ కథనంలో రాశారు. చాలా బాధ్యతాయుతంగా, ఎంతో సంఘీభావంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొనియాడారు.
కరోనా వల్ల లాక్డౌన్ పరిస్థితి ఏర్పడి అయిదేళ్ల అయిన సందర్భంగా ఆయన ఈ కథనాన్ని రాశారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య దౌత్యంలో భారత ఓ కీలకమైన దేశంగా ఎదిగిందని తెలిపారు. సుమారు వందకుపైగా దేశాలకు రెండు అతిప్రధానమైన కరోనా టీకాలను భారత్ సరఫరా చేసినట్లు తన కథనంలో పేర్కొన్నారు.
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు సుమారు వందకుపైగా దేశాలకు వెళ్లాయని, అత్యవసరమైన సమయంలో చేయూతను అందించి భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించిందని పేర్కొన్నారు. వసుదైక కుటుంబం అన్న భావాన్ని భారత్ వినిపించిందని కొనియాడారు. ఉప ఖండంలోని ఇతర దేశాలతోనూ సఖ్యతగా వ్యవహరించిందని ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని కోవాక్స్ ప్రోగ్రామ్కు ఇండియా సహకారం అందించడాన్ని కాంగ్రెస్ నేత ప్రశంసించారు. కరోనా రెండో వేవ్ సమయంలో వ్యాక్సిన్ సరఫరా స్తంభించినా అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించినట్లు తెలిపారు.
భారత్ తన టీకా దౌత్యాన్ని ప్రదర్శించిన తీరు విదేశీ విధానంలో కీలకమైందని చెప్పారు. మానవత్వాన్ని, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించిందని మెచ్చుకున్నారు. ట్రంప్ను వైట్హౌజ్లో కలవడం, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్, జెలెన్స్కీలతోనూ మోదీ నిర్వహించిన దౌత్య రీతిని థరూర్ గతంలో మెచ్చుకున్నారు.

More Stories
80 ఏళ్ల క్రితం ఈ రోజున కలకత్తా తగలబడిపోయింది
బంగ్లా ప్రధాని రహమాన్ భారత్ పర్యటనపై దౌత్య చర్చలు
నల్సార్ వివాదంలో బార్ కౌన్సిల్ చైర్మన్ క్షమాపణలు