బలూచి రైల్ హైజాక్ భారత్‌కు అంటగట్టే యత్నంపై ఆగ్రహం

బలూచి రైల్ హైజాక్ భారత్‌కు అంటగట్టే యత్నంపై ఆగ్రహం
ఇటీవల జరిగిన బలూచిస్థాన్ రైలు హైజాక్‌ పథక రచన విదేశాల్లో జరిగిందని పేర్కొంటూ బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల వెనుక న్యూఢిల్లీ హస్తం ఉందని పాకిస్తాన్ కారుకూతలు కూయడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్‌ కృషి చేస్తోందని అవాకులు చెవాకులు పేలిన పాక్‌కు భారత్ దిమ్మదిరిగే జవాబు ఇచ్చింది. 
 
అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో మొత్తం ప్రపంచానికి తెలుసని అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ మండిపడ్డారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు రైలు హైజాక్‌కు భారత్‌ కారణమంటూ పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. 
 
“పాకిస్థాన్ విదేశాంగ విధానంలో ఎటువంటి మార్పు లేదు. నిరాధారమైన ఆరోపణలతో ఇతరులవైపు వేలెత్తి చూపించే బదులు అంతర్గత సమస్యలపై పొరుగుదేశం దృష్టిసారిస్తే బాగుంటుంది. తీవ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు.. ముందు మీ ఇంటిని సరిచేసుకోవాలి” అంటూ ఆయన హితవు పలికారు.
 
మార్చి 11 మంగళవారం మధ్యాహ్నం పాక్‌లోని బలూచిస్థాన్‌లో 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తోన్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. పట్టాలను పేల్చేసి, రైలును ఆపి స్వాధీనంలోకి తీసుకున్నారు. మార్గంలో 17 సొరంగాలు ఉండగా, 8వ సొరంగం వద్ద జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
 
బందీలను విడుదల చేయడానికి ఆపరేషన్ చేపట్టిన పాకిస్థాన్ సైన్యంబలోచ్‌ మిలిటెంట్లు 33 మందిని హతమార్చినట్టు ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కానీ, 100 మంది సైనికులను తాము చంపినట్టు బీఎల్ఏ పేర్కొంది.

అయితే, ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై అభాండాలు వేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో హైజాక్ ఘటన భారత్‌‌కు ముడిపెడుతూ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని, భారత మీడియా బీఎల్‌ఏను కీర్తిస్తోందని ఆరోపించింది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక రకంగా ప్రసారం చేస్తోందంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది.