ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్

ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్
కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు స్వయంగా వెళ్లిన ప్రధాని మోదీ ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. 
 
ఇక నిర్మలమ్మ బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని కొనియాడారు. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచే “ప్రజల బడ్జెట్”గా , పెట్టుబడులను పెంచే, వృద్ధికి దారితీసే శక్తి-గుణకం అని ప్రధాని తెలిపారు. ఈ బడ్జెట్ కారణంగా దేశ ప్రజల్లో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తాజాగా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్‌ వైపు అడుగులు వేయిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్‌ ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయుల కలలను నెరవేర్చే బడ్జెట్‌ అని ప్రశంసించారు. అంతేకాకుండా ఈ బడ్జెట్‌తో దేశంలోని అనేక రంగాల్లో యువతకు తమ ప్రభుత్వం భారీగా అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.