ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర

ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర

జనవరి 26 న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ  కేంద్ర ప్రభుత్వం పోలీస్‌, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్‌ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు ఉన్నారు.  సైనికులకు అందించే అత్యున్నత పురస్కారాలలో రెండోది అయిన కీర్తి చక్ర అవార్డు ఈసారి ఇద్దరికి ప్రదానం చేయనున్నారు.

రాష్ట్రీయ రైఫిల్స్ 22వ విభాగానికి చెందిన మేజర్ మంజీత్‌తో పాటుగా, రాష్ట్రీయ రైఫిల్స్ 28వ విభాగానికి చెందిన నాయక్ దిలావర్ ఖాన్‌లకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ మంజీత్‌ 2024 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో జరిగిన ఓ ఆపరేషన్‌లో తీవ్రవాదిని మట్టుబెట్టి పలువురు పౌరుల ప్రాణాలను కాపాడారు.

ఈ నేపథ్యంలో ఆయనకు కీర్తి చక్ర పురస్కారం వరించింది. అలాగే జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలోని లోగాన్ ప్రాంతంలో గత ఏడాది జూలైలో జరిగిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినందుకు ఆర్మీ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీకి చెందిన నాయక్ దిల్వార్ ఖాన్‍‌కు.. మరణానంతరం కీర్తి చక్రను ప్రకటించారు.
అలాగే జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని మాచేడి సెక్టార్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినందుకు స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన సుబేదార్ వికాస్ తోమర్‌కు శౌర్య చక్రను ప్రకటించారు.
ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌కు చెందిన కెప్టెన్ దీపక్ సింగ్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు ప్రకటించారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన కెప్టెన్ దీపక్ సింగ్.. భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవటంలో సాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరణానంతరం ఈయనకు శౌర్య చక్ర అవార్డు ప్రకటించారు.

అలాగే భారత సైన్యంలోని సదరన్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్, మాస్టర్ జనరల్ సస్టెన్స్ లెఫ్టినెంట్ జనరల్ అమర్ దీప్ సింగ్ అహూజాకు పరమ్ వికసిత్ సేవా మెడల్ ప్రకటించారు. లెఫ్టినెంట్ కమాండర్ సౌరభ్ మాలిక్‌కు నావో సేనా మెడల్ పురస్కారం ప్రకటించారు. వీటితో పాటుగా సాయుధ దళాలు, ఇతర సిబ్బందికి 305 డిఫెన్స్ డెకరేషన్స్ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు.
వీటిలో 30 పరమ విశిష్ట సేవా పతకాలు, ఐదు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 57 అతి విశిష్ట సేవా పతకాలు,10 యుద్ధ సేవా పతకాలు, 43 సేన పతకాలు, 8 నావో సేన పతకాలు, 15 వాయు సేన పతకాలు ఉన్నాయి. 95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు.
వీరిలో నక్సలైట్‌ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ము కాశ్మీర్‌ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన ముగ్గురు సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.

101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్‌లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్‌ సర్వీస్‌ (ఎంఎస్‌ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్‌ డిఫెన్స్‌-హోం గార్డ్స్‌కు, 36 కరెక్షనల్‌ సర్వీస్‌కు లభించాయి.

రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మందికి, జమ్ము కాశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్‌ నుండి ఒక సైనికునికి, బీఎస్‌ఎఫ్‌ నుండి ఐదుగురు, సీఆర్‌పీఎఫ్‌ నుండి 19 మంది, ఎస్‌ఎస్‌బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి.