మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ నేత చలపతి మృతి

మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ నేత చలపతి మృతి
 
* 20కు పెరిగిన మావోయిస్టు మృతుల సంఖ్య * కోన ఊపిరిలో నక్సలిజం… అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్‌కౌంటర్‌ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని కుల్హాది ఘాట్‌లోని అటవీ ప్రాంతాన్ని వెయ్యి మందికిపైగా భద్రతా బలగాలు అన్ని వైపులా చుట్టుముట్టాయి.
అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు అక్కడ దాక్కుట్లు సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్‌ నిర్వహించాయి. ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్‌ను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను విమానంలో రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది నక్సల్స్‌ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పూర్‌ జోన్‌ ఐడీ అమ్రేష్‌ మిశ్రా తెలిపారు.

ఆ మృతుల్లో మావోయిస్టు సెంర‌ల్ క‌మిటీ సభ్యుడు చలపతి అలియాస్‌ రామచంద్రా రెడ్డి అలియాస్‌ జైరామ్‌ కూడా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన వారు. చలపతిపై ప్రభుత్వాలు రూ.కోటి రివార్డు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌ తదితర ఆటోమేటిక్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతుందన్నారు.

మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్హాది ఘాట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోందని.. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందిందని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ న‌క్స‌లిజానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌ని పేర్కొన్నారు. న‌క్స‌ల్స్ ర‌హిత భార‌త్ దిశ‌గా కీల‌క అడుగు ప‌డింద‌ని చెబుతూ మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ఇది గొప్ప విజ‌యమ‌ని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారులో 2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌ నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సోమ‌వారం జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌లైట్లు మృతిచెంద‌గా, ఓ కోబ్రా జవాన్ గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.  మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడు జ‌యరాం అలియ‌స్ చ‌ల‌ప‌తిపై కోటి రూపాయ‌ల న‌జ‌రానా ఉన్న‌ట్లు గ‌రియాబంద్ ఎస్పీ నిఖిల్ ర‌కీచా తెలిపారు. ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయిన న‌క్స‌ల్స్ మృత‌దేహాల‌ను గుర్తిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఇంకా ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయ‌ని, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా జ‌న‌వ‌రి 19వ తేదీన కుల‌రీఘాట్ రిజ‌వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లైంద‌ని చెప్పారు. ఇక గరియాబంద్‌ ఆపరేషన్‌లో గ్రూప్‌ ఈ30, కోబ్రా 207, సీఆర్పీఎఫ్‌ 65, 211 బెటాలియన్‌, ఎస్‌ఓసీ నువాపాడా సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మూడు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు విభాగానికి చెందిన రెండు, సీఆర్పీఎఫ్‌కు చెందిన ఐదు బృందాలు పాల్గొన్నాయి.

చ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి భ‌ద్ర‌తా ద‌ళాల‌ను ప్ర‌శంసించారు. 2026 మార్చి నాటికి చ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి న‌క్స‌లిజాన్ని త‌రిమివేయ‌నున్న‌ట్లు చెప్పారు. సైనికుల సాధించిన విజ‌యం అద్భుత‌మ‌ని, వారి సాహ‌సానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది చ‌త్తీస్‌ఘ‌డ్‌లో 40 మంది న‌క్స‌ల్స్ మృతిచెందారు. గ‌త ఏడాది చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని భ‌ద్ర‌తా ద‌ళాలు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో 219 మంది న‌క్స‌ల్స్‌ను హ‌త‌మార్చాయి.