మహా కుంభమేళాలో తిరుమలేశుడు

మహా కుంభమేళాలో తిరుమలేశుడు

ఉత్తర ప్రదేశ్ లో జ‌ర‌గ‌నున్న మహాకుంభ మేళలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జ‌రుగనున్న మహాకుంభ మేళలో సెక్టార్ 6లో వాసుకి ఆలయం ప్రక్కన శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళ జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద మీడియాతో శనివారం ఛైర్మెన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్ లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు చేపడుతారని ఛైర్మెన్ తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు చేపట్టాలని సూచించామన్నారు.

మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ సిద్దం చేశామని తెలిపారు. మహాకుంభ మేళకు టిటిడి అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

కాగా, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారని వివరించారు.

జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.