తిరుమల పరకామణిలో రూ 100 కోట్ల కుంభకోణం

తిరుమల పరకామణిలో రూ 100 కోట్ల కుంభకోణం
తిరుమలలోని పరకామణిలో వైసీపీ హయాంలో రూ.100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బీఆర్ నాయుడికి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. 

పరకామణిలో పెద్దజీయర్‌ తరఫున సీవీ రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, కొన్ని సంవత్సరాలుగా ఆయన రహస్యంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని ఆయన వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్‌ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని భానుప్రకాష్​రెడ్డి వెల్లడించారు.

సీవీ రవికుమార్‌ 2023 ఏప్రిల్‌ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని భానుప్రకాశ్​రెడ్డి పేర్కొన్నారు. దీనిపై వెంటనే విజిలెన్స్‌ సహాయ భద్రతాధికారి సతీష్‌కుమార్‌  పోలీసులకు ఫిర్యాదు చేయగా చెప్పారు. రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. అయితే నిందితుడిని అరెస్ట్ చేయకుండా అదే సంవత్సరం సెప్టెంబర్​లో లోక్‌ అదాలత్‌లో రాజీకి వచ్చారని భానుప్రకాశ్​రెడ్డి వివరించారు.

అప్పటి టీటీడీ అధికారులు కొందరు, పోలీసులు, నాటి టీటీడీ ఛైర్మన్‌ కలిసి రవికుమార్‌ను బెదిరించి రూ.100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని భానుప్రకాష్​రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెబుతూ దీని వెనుక ఉన్న శక్తులు, వ్యక్తులు, పాత్రధారతులు, సూత్రధారులు, వాటదారులు ఎవరున్నారు అనే అంశంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ  చేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ కమిషన్ వేయాలని కేంద్రాన్ని కోరుతానని భానుప్రకాశ్​రెడ్డి వెల్లడించారు.

 
 ‘వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో భారీ కుంభకోణం జరిగింది. పరకామణిలో ఉద్యోగి రవికుమార్ చేతివాటం ప్రదర్శించారు. రూ.200 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను రవికుమార్ చోరీ చేశారు. హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్‌లోనే రవికుమార్ పట్టుబడ్డారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారు. కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నిందితుడ్ని వదిలేశారు’ అని తెలిపారు.