జనవరి 8న అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన

జనవరి 8న అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8న అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్నట్లు  అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. . ప్రధాని మోదీ చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ. లక్షన్నర కోట్ల్లతో నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్, అచ్యుతాలోని ఎన్టీపీసీలో హైడ్రోజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకుశంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 
 
అనకాపల్లి జిల్లా కశింకోటలో అసెంబ్లీ స్పీకర్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ ఎంపీ రమేష్, అనకాపల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వైఎస్సార్‌సీపీ నేతల్ని కూటమి కూటమి పార్టీల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.
 
వాస్తవానికి ప్రధాని మోదీ నవంబర్‌లోనే అనకాపల్లి జిల్లా పర్యటనకు రావాల్సి ఉంది. ఆ సమయంలో తుఫాన్ హెచ్చరికలతో పర్యటనను వాయిదా వేశారు. వాస్తవానికి నవంబర్ 29న ఈ పర్యటనను నిర్ణయించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో లక్షమందితో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేశారు. కానీ తుఫాన్ కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖాయమైంది.

మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు విశాఖపట్నం సాగరమాల ఆడిటోరియంలో రోజ్‌గార్‌ మేళా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్‌, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారలు తదితరులు పాల్గొన్నారు. 
 
వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం కృషి చేస్తోందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కేంద్రం 13 రోజ్‌గార్‌ మేళాల్లో 7.79 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనుల్ని వేగవంతం చేశామని చెబుతూ 2026 జూన్‌ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయని పూర్తి చేస్తామని ప్రకటించారు.