
జీహెచ్ఎంసీ మినహా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో హైడ్రాకు దక్కిన హక్కుల మేరకు కూల్చివేతలకు ఆదేశాలిచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతి లేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించడం జరుగుతుందని చెప్పారు.
చిరు వ్యాపారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్.. స్థానిక నివాసితులకు, ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. 2024 జులైకి ముందు అనుమతులు లేని వాణిజ్య సముదాయాల కూల్చివేతలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. నోటీసుల విషయాన్ని అక్కడి వ్యాపారులకు చెప్పకుండా మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ యజమాని తప్పుదోవ పట్టించారని రంగనాథ్ వివరించారు.
భాగ్యనగరంలో హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. మణికొండ మున్సిపాలిటీ పరిధి అల్కాపురి టౌన్షిప్లోని అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్లో రెసిడెన్షియల్ పేరుతో అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు 4 షట్టర్లను తొలగించింది. 2016లో హెచ్ఎండీఏ అనుమతులతో రామిరెడ్డి అనే వ్యక్తి మార్నింగ్ రాగా పేరుతో 5ఫ్లోర్ల అపార్ట్మెంట్ నిర్మించారు. అందులో నివసిస్తున్న వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు, నిత్యావసర సరకులు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు.
కాగా, స్థానిక నివాసితుల ఫిర్యాదుల మేరకే మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ షెట్టర్ల తొలగింపు జరిగినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2 వారాల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథ్ స్థానిక నివాసితులు, వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్న యజమానిని ఎదురెదురుగా ఉంచి విచారించారు. హెచ్ఎండీఏ, హైడ్రా, మున్సిపాలిటీ విభాగాలకు నివాసితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారించి వ్యాపారానికి అనుమతులు లేవని నిర్ధారించారు. షోకాజ్ నోటీసులతో పాటు తగిన సమయం ఇచ్చాకే హైడ్రా సమక్షంలో కూల్చివేతలు జరిగినట్లు తెలిపారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి