
అయితే ఈ లేఖలలో నెహ్రూ ఎడ్వినా మౌంట్బాటన్ల లేఖల విషయంలో ఆసక్తి చెలరేగుతుంది. నెహ్రూ ఎంతో మంది నాయకులతో పాటు ఎడ్వినాకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను కాంగ్రెస్ ఎందుకు దాస్తోందంటూ బీజేపీ విస్మయం వ్యక్తం చేస్తుంది. అందులో ఏముందో అందరికీ తెలియాలంటూ వాటిని వెంటనే అప్పజెప్పాలని డిమాండ్ చేస్తోంది. అసలు ఈ లేఖలు ఎక్కడివి, అందులో ఏమున్నాయనే ఆసక్తి చెలరేగుతుంది.
జవహార్లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్బాటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి వాళ్లకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలను 51 బాక్సుల్లో ప్యాక్ చేసి 2008లో సోనియా గాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి వాళ్ల దగ్గరే ఉన్నాయి.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సభ్యులు పార్లమెంట్ లో లేవనెత్తారు. నెహ్రూ ఎడ్వినాకు రాసిన లేఖల్లో ఏదో ఉందని, అందుకే కాంగ్రెస్ వాటిని దాచి పెడుతుందంటూ అనుమానాలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. బీజేపీకి చెందిన అనేక మంది నాయకులు ఈ లేఖల్లో ఏముందో చెప్పాలంటూ సోషల్ మీడియా వేధికగా అటు సోనియాతో పాటు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. అయితే వీటిపై కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.
కానీ ఎడ్వినా మౌంట్ బాటన్ కుమార్తె పమేలా హిక్స్ ఇదివరలో ఈ అంశంపై స్పందించింది. తాను లేఖలు చదవకపోయినప్పటికీ వారి మధ్య ఉన్న బంధం గురించి తెలిపింది. నెహ్రూ ఎడ్వినాల మధ్య పరస్పర గౌరవం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. తన తల్లి నెహ్రూలో తెలివి, సమానత్వాన్ని చూసిందని స్పష్టం చేసింది.
అలాగే వారిద్దరి మధ్య శారీరక సంబంధం గురించి వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. వారిద్దరూ ఎప్పుడూ అధికారులు, పోలీసుల మధ్య ఉండేవాళ్లని, వాళ్లకు ఒంటరిగా ఉండే సమయం అసలు దొరికలేదని చెప్పుకొచ్చింది. ఎడ్వినా భారత దేశాన్ని వదిలి వెళ్లేముందు నెహ్రూకు ఒక ఉంగరాన్ని ఇవ్వాలనుకుందని పమేలా తెలిపింది. కానీ ఆయన దాన్ని స్వీకరించరని ఆమె కూతురు ఇందిరా గాంధీకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఎడ్వినా దేశం విడిచి వెళ్లేముందు నెహ్రూ చేసిన ప్రసంగం వారిద్దరి మధ్య సాన్నిహిత్య బంధాన్ని మరింత వెలుగులోకి తెచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఓదార్పునిచ్చారు, ప్రోత్సహించారు కాబట్టి భారత ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. అలాగే మిమ్మల్ని తమలో ఒకరిగా భావిస్తారని నెహ్రూ అప్పటి ప్రసంగంలో చెప్పారు.
అలాగే మీరు వెళ్తున్నందుకు అందరూ బాధపడడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అని అడుగుతానే వెళ్తున్నారా అని ప్రశ్నించారు. దీంతో వీరిద్దరి మధ్య బంధంపై అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నెహ్రూ-ఎడ్వినా లేఖలను బహిరంగ పరచాలని బీజేపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది.
ముఖ్యంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రచించిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ను ఉటంకిస్తూ జవహార్లాల్ ఎడ్వినా మౌంట్బాటన్ కూడా బాగా ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు. కానీ ఆమె ప్రభావం మరింత ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ లేఖలు బయటకు వస్తాయా? వస్తే అందులో ఏముందన్నది ఆసక్తి కలిగిస్తుంది.
51 డబ్బాల్లో ఉన్న ఈ లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)కి 1971లో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ అప్పగించింది. 2008లో సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు వీటిని ఎన్ఎంఎంఎల్ ఆమెకు అప్పగించినట్టు తెలుస్తున్నది. ఎన్ఎంఎంఎల్ను అందరి మాజీ ప్రధానుల మ్యూజియంగా విస్తరించి ఇటీవల కేంద్రం పీఎంఎంఎల్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఆ లేఖలపై నెహ్రు కుమార్తె ఇందిరా గాంధీకి ఆమె చనిపోయేవరకు పూర్తి అధికారం ఉంది. అయితే, వాటిని `జాగ్రత్తగా ఉంచడం’ కోసమని ఆమె `జహావర్ లాల్ నెహ్రు మెమోరియల్ ఫండ్’ (జెఎన్ఎంఎఫ్)కు అందజేశారు. అయితే ఆమె `బహుమతి’గా ఇవ్వక పోవడం గమనార్హం. ఆ తర్వాత సోనియా గాంధీ సహితం ఆ లేఖలను `జాగ్రత్తగా ఉంచడం’ కోసం అంటూ జెఎన్ఎంఎఫ్కు `బహుమతిగా ఇచ్చారు. 2022లో జెఎన్ఎంఎఫ్ పేరును పీఎంఎంఎల్ గా మార్చారు.
ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అందజేసిన ఈ లేఖలను అక్కడి నుండి మే 5, 2008లో తరలించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశం చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగిన ఈ లేఖల యాజమాన్యం, భద్రతల గురించిన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆ సమయంలో సోనియా గాంధీ యుపిఎ చైర్ పర్సన్ గా కీలక స్థానంలో ఉన్నారు. 2014 నుండి ఆ లేఖలను వెనుకకు తీసుకు రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
గత ఏప్రిల్ లో జరిగిన పీఎంఎంఎల్ జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆ సమావేశంలో రాజనాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన వంటి ప్రముఖులు ఉన్నారు.
కాగా, నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తున్నదో దేశానికి తెలియాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని, దేశానికి చెందిన చారిత్రక పత్రాలని ఆయన తెలిపారు. ఈ ఉత్తరాలు ప్రజల్లో ఉండొద్దని గాంధీ కుటుంబం ప్రయత్నిస్తుండటానికి కారణమేంటని? వాటిల్లో ఏముంది? అని ఆయన ప్రశ్నించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు