జపాన్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు గెలుపు

జపాన్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు గెలుపు

జపాన్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు సీట్లను గెలుచుకున్నారు. రికార్డు స్థాయిలో మహిళలు జపాన్‌ ప్రతినిధుల సభకు ఎన్నుకోబడినట్లు సోమవారం అంచనా వేసింది. అయితే 16 శాతం కన్నా తక్కువ.  ఇంకా మైనారిటీలో కొనసాగుతున్నారు.

465 సీట్లు కలిగిన దిగువసభలో 73 సీట్లను మహిళలు గెలుచుకున్నట్లు ప్రభుత్వ మీడియా ఎన్‌హెచ్‌కె అంచనా వేసింది. ఈ రోజు తర్వాత అధికారిక ఫలితాల్లో ఈ గణాంకాలు ధృవీకరించబడతాయని భావిస్తున్నారు. 2021 సాధారణ ఎన్నికల్లో దిగువసభకు 45 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు పోటీ చేస్తున్నారని, దాదాపు నాలుగవ వంతు అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వ మీడియా, ఇతర సంస్థలు ప్రకటించాయి.

జపాన్‌లో ఇప్పటికీ వ్యాపారాలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని, 146 దేశాల జాబితాలో జపాన్‌ 118 ర్యాంకులో ఉన్నట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కి చెందిన ప్రపంచ లింగ అసమానత సూచీ నివేదిక పేర్కొంది. ప్రధాని షిగెరు ఇషిబాకి చెందిన 20 మంది సభ్యుల క్యాబినెట్‌లోనూ కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు.

పురుషాధిక్యత, నిష్పక్షపాత లేని జపాన్‌ రాజకీయ పార్టీల్లో మహిళా అభ్యర్థులను గుర్తించడం కష్టమని గత నెలలో పాలక పార్టీ నాయకత్వ ఓటుకు ముందు ‘నో యూత్‌ నో జపాన్‌’ సంస్థ అధినేత మొమోకో నోజో చెప్పారు. 2021లో నిర్వహించిన క్యాబినెట్‌ ఆఫీస్‌ సర్వేలో జపాన్‌లోని మహిళా ఎన్నికల అభ్యర్థులలో నలుగురిలో ఒకరు తమ ప్రచార సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు జిజి ప్రెస్‌ పేర్కొంది.

ఆదివారం ఎన్నికల్లో ఇషిబా అధికార కూటమి ఘోరమైన ఇతమికి గురయింది. కుంభకోణాలతో కళంకితమైన ప్రధాని షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. పాలక ఎల్‌డిపి పార్టీ ఇంతటి దారుణ ఓటమిని చవి చూడడం 2009 తరువాత ఇదే మొదటిసారి. పార్లమెంట్‌ దిగువ సభలో మొత్తం 465 స్థానాలకు గాను ఇషిబా లిబరల్‌డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డిపి), దాని సంకీర్ణ భాగస్వామి కొమెటోకు కలిపి 215సీట్లు మాత్రమే వచ్చాయి. .ఈ కూటమి గత సారి ఎన్నికల్లో 279సీట్లు సాధించింది.

ప్రధాన ప్రతిపక్షం కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ జపాన్‌ (సిడిపిజె)కు గతంలో 98వుండగా ఈసారి 148సీట్లు గెలుచుకుంది. అయితే ఈ కూటమికి కూడా మెజారిటీకి కావాల్సిన 233 సీట్లు రాలేదు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం 30రోజుల్లోగా ఈపార్టీలు పాలించే కూటమిని రూపొందించుకోవాల్సి వుంటుంది. నెల రోజుల క్రితమే ఇషిబా ప్రధాని పదవి చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంతకాలం పదవిలో వుంటారో స్పష్టంగా తెలియడం లేదు