ఎంఎల్‌ఎ రఘురామ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

ఎంఎల్‌ఎ రఘురామ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

ఉండి ఎంఎల్‌ఎ రఘురామ కృష్ణంరాజు కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రకాశం ఎస్‌పి దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఎఎస్‌పి రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్‌పికి అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఎఎస్‌పికి ఆదేశాలు జారీ చేశారు.

సిఐడి పోలీసులు కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంఎల్‌ఎ రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్‌కు హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కాగా పోలీసులు ఇటీవల విజయ పాల్‌ను విచారించడంలోసరిగా వ్యవహరించలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టు బెయిల్ తిరస్కరించినా విజయ పాల్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపణలొచ్చాయి. అందుకే దర్యాప్తు అధికారిని ప్రభుత్వం మార్చింది. అప్పటి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్ కు హైకోర్టులో చుక్కెదు రైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.ప్రస్తుత టిడిపి ఎంఎల్‌ఎ, మాజీ ఎంపి రఘురామ కృష్ణరాజును సిఐడి కస్టడీలో విజయ్‌పాల్ చిత్రహింసలు పెట్టారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘు రామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు విజయపాల్‌తో పాటు అప్పటి సిఎం జగన్ మోహన్ రెడ్డి, సిఐడి డిజి సునీల్ కుమార్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలను నిందితులుగా పోలీసులు చేర్చారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు షురూ అయ్యింది.