
వరుస తుపాన్ల ప్రభావం, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరు జిల్లాలో చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతోపాటు ఏలూరు-కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. లంక గ్రామాలను వరద చుట్టేసింది. కొల్లేరు మరింత ఉగ్రరూపం దాలిస్తే సరస్సులోని 94 గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది.
ప్రధానంగా కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం వద్ద ఉప్పుటేరులో రోడ్డు వంతెనల వద్ద దట్టమైన కిక్కిసకర్ర అలుముకుంది. అలాగే రైల్వే బ్రిడ్జి, జాతీయ రహదారి విస్తరణలో ఉప్పుటేరుపై నూతనంగా నిర్మాణం చేసిన వంతెన సగంలో నిలిపివేశారు. దీంతో ఉప్పుటేరులో 100 మీటర్ల వరకు దారి పూడుకు పోయింది. ఉప్పుటేరు అనేకచోట్ల ఆక్రమణలకు గురికావడం సరస్సు నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి వెళ్లకుండా అవరోధాన్ని సృష్టిస్తోంది.
సాధారణ రోజుల్లో కొల్లేరులో సగటున రెండు మీటర్ల నీటిమట్టం ఉంటుంది. శుక్రవారం ఉదయానికి ఇది 3.30 మీటర్లకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020 అక్టోబరులో కొల్లేరు ఉగ్రరూపం దాల్చి సమీప గ్రామాలను ముంచెత్తింది. అప్పట్లో గరిష్ట నీటిమట్టం 3.50 మీటర్లుగా నమోదైంది. అంటే, నీటిమట్టం ఇంకో 20 సెంటీమీటర్లు పెరిగితే తీర గ్రామాలు ముంపులో చిక్కుకున్నట్లే.
మరోపక్క కొల్లేరులోకి నీరు వేగంగా లాగకపోవడంతో దానిలో కలిసే మురుగు కాలువలన్నీ బిగదన్నుతున్నాయి. ప్రస్తుతం చినకాపవరం, ఆలకోడు, తుమ్మకోడు తదితర కాలువల్లో వరద నీరు పలుచోట్ల గట్లను తాకుతూ ప్రవహిస్తోంది. కాగా, గురువారం వరకూ ఉప్పొంగి ప్రవహించిన గోదావరి, శబరి, ఇతర కొండవాగులు శుక్రవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టాయి.
అయినా, అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల ప్రజలను మాత్రం భయం వెంటాడుతూనే ఉంది. వారం రోజులపాటు గోదావరి ప్రవాహం తగ్గుతూ.. పెరుగుతూ ఉండొచ్చని సిడబ్ల్యుసి అధికారులు చెబుతుండడంతో విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చింతూరు వద్ద శబరి 26 అడుగులుగా నమోదైంది.
విఆర్.పురం మండలంలోని రహదారులు పలుచోట్ల ఇంకా ముంపు నుంచి బయటపడలేదు. చింతూరు మండలంలో మల్లెతోట గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు క్రమేపీ తగ్గుతోంది. సోకులేరు వాగు ఉధృతి పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో విఆర్.పురం, చింతూరు రహదారి జలదిగ్బంధంలోనే ఉంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కివ్వాకలో మిర్చి నాట్లు నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావం కొనసాగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు నిల్చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి