విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు .. నలుగురు మృతి

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు .. నలుగురు మృతి
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని, ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గడిచిన మూడుగంటల్లో వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. 
 
కళింగపట్నం దక్షిణ-ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఒడిశా గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్యనున్న కళింగపట్నానికి దగ్గరగా శనివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడి మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.

 మృతులు మేఘన, బి. లక్ష్మీ, అన్నపూర్ణ, లాలో పూర్కయత్​గా గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారోనని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

 కాగా, వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజులు సైతం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.