రాజ్యసభకు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 9 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప-ఎన్నికలు నిర్వహించగా ఎటువంటి పోటీ లేకుండానే 12 మంది ఎన్నికయ్యారు. వీరిలో 11 మంది ఎన్డీయే సభ్యులే. 9 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ (అజిత్ పవార్), రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
దీంతో ఎగువసభలో ఎన్డీయే సంఖ్యా బలం మ్యాజిక్ ఫిగర్కు చేరువయ్యింది. అలాగే, అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉండగా ఎనిమిది ఖాళీలు ఉన్నాయి. వీటిలో నాలుగు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానివి, మిగతా నాలుగు నామినేటెడ్. ప్రస్తుత సంఖ్య ప్రకారం సాధారణ మెజార్టీ 119 అయితే ఎన్డీయే బలం 112గా ఉంది.
ప్రస్తుతం ఎంపికైన బీజేపీ సభ్యుల్లో అసోం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలి, బిహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హరియాణా నుంచి కిరణ్ చాధరీ, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, మహారాష్ట్ర నుంచి ధిర్యా షీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మెహంత, రాజస్థాన్ నుంచి రన్వీత్ సింగ్ బిట్టు, త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ ఉన్నారు.
ఇక, కాంగ్రెస్కు చెందిన అభిషేక్ మనుసింఘ్వి తెలంగాణ నుంచి, అజిత్ వర్గానికి చెందిన నితిన్ పాటిల్ (మహారాష్ట్ర), బిహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా (ఆర్ఎల్ఎం) ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఎన్డీయే మెజారిటీ మార్కుకు చేరుకోవడంతో మోదీ సర్కారుకు కీలక బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఆటంకం ఉండదు.
ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రతిపక్షానిదే సంఖ్యాబలం. దీంతో తరచుగా ఎగువ సభలో వివాదాస్పద ప్రభుత్వ బిల్లులు మోక్షం లభించలేదు. అయితే, నవీన్ పట్నాయక్, జగన్మోహన్రెడ్డిలకు చెందిన భాగస్వామ్య పార్టీల సాయంతో కొన్నింటికి గట్టెక్కించింది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. ఒడిశాలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో దాని మిత్రపక్షం టీడీపీ అధికారంలోకి వచ్చాయి.
వైసీపీకి 11 మంది, బిజెడికి 9 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. కీలక బిల్లుల విషయంలో బిజెపి ఈ రెండు పార్టీల మద్దతుపై ఆధారపడుతూ వస్తున్నది. మారిన రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బిజెపి వ్యతిరేక శిబిరంకు చేరారు. అయితే, ఇప్పుడు ఆ రెండు పార్టీల మద్దతు లేకపోయినా బిజెపికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి.

More Stories
ఈశాన్య ప్రాంతాన్ని తూర్పు పాక్ తో కలిపేందుకు కాంగ్రెస్ కుట్ర
గగన్యాన్ మిషన్ దిశగా డ్రోగూ పారాచూట్ పరీక్షలు
టీ20 ప్రపంచ కప్ భారత జట్టుకు శుభ్మన్ గిల్ దూరం