షేక్ హసీనా పాస్ పోర్టు రద్దు

షేక్ హసీనా పాస్ పోర్టు రద్దు

బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మాజీ ఎంపీల దౌత్య పాస్ పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దౌత్య పాస్ పోర్టులు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించొచ్చు.

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు జడిసి షేఖ్ హసీనా ఆగస్టు 5 నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక పాలన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్ లో ఇప్పుడున్న ప్రభుత్వమే దౌత్య పాస్ పోర్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భాగస్వామ్యులందరితో చర్చించిన అనంతరం హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నాయి. త్వరలో అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు వెళ్లేందుకు వినియోగించిన దౌత్య పాస్‌పోర్ట్‌ను ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది.

కాగా, హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్ పి) భారత్ ను డిమాండ్ చేసింది. హసీనా పై ఉన్న అభియోగాలపై విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని బిఎన్ పి సెక్రటరీ జనరల్ ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగిర్ డిమాండ్ చేశారు.
 
‘‘భారత్ లో ఆమెకు ఆశ్రయం కల్పించడం విచారకరం. అక్కడి నుంచి ఆమె బంగ్లాదేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఆమెను బంగ్లాదేశ్ కు న్యాయబద్ధంగా అప్పగించాలి. పలు అభియోగాల్లో ఆమెను విచారించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని ఆలంగిర్ పేర్కొన్నారు. 
నిరసనల్లో మరణించిన అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలపై హసీనా, ఆమె అనుచరులు 30 మందికి పైగా ఉన్నవారిపై కేసులు నమోదయ్యాయి.