మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం

మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం
* ఎంపాక్స్‌ కొత్త కరోనా కాదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం

మంకీపాక్స్‌ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు మంకీపాక్స్‌ పలు దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.  వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దవాఖానాల్లో బెడ్‌లను రిజర్వ్‌ చేయడంతో పాటు ప్రధాన ల్యాబ్‌లను సైతం అప్రమత్తం చేసింది.

వ్యాధి నిర్ధారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో రోగులకు ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. చికిత్స చేయడంతో పరిశీలనలో ఉంచనున్నారు. ఢిల్లీ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదైతే.. సదరు రోగులను సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్పించనున్నారు. అలాగే, ఆల్‌ ఇంఇయా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్)లో ఐదు పడకలను రిజర్వ్‌ చేశారు. 

ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఎవరికైనా మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించినా మంకీపాక్స్‌ అనుమానిత కేసులు వచ్చినా వారిని ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన బెడ్‌పై ఉంచి చికిత్స అందిస్తారు.  ఢిల్లీలోని ఎయిమ్స్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్‌ మెడికల్‌ హాస్పిల్స్‌ను మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు కోరారు. అలాగే, వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు అవసరమైన మార్గదర్శకాలను సైతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

కాగా, ఎంపాక్స్‌ కొత్త కరోనా కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ ప్రాంతీయ సంచాలకులు హన్స్‌ క్లుగె స్పష్టం చేశారు. ఎంపాక్స్‌ను ఎదుర్కోవడం, నిర్మూలించడంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధిని ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందనేది భవిష్యత్తులో ప్రజారోగ్య రక్షణకు కీలక పరీక్ష లాంటిదని హెచ్చరించారు.

మరోవంక, ప్రపంచదేశాలను కలవరపరుస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) వ్యాధికి టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. ఏడాదిలోగా దీనిపై సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.  డబ్ల్యు హెచ్‌ఓ గతంలో ఇచ్చిన డేటా ప్రకారం 116 దేశాల్లో 2022 నుండి మంకీపాక్స్‌ కేసులు 99,176 నమోదయ్యాయి. 208మంది మరణించారు. భారత్‌లో ఈ కేసులు 30వరకు నమోదయ్యాయి. చివరి కేసు ఈ ఏడాది మార్చిలో నమోదైంది.