అంగరంగ వైభవంగా ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌

అంగరంగ వైభవంగా ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌
* భారత్‌కు ఆరు పతకాలు
 
రెండు వారాల పాటు ప్రపంచవ్యాపితంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన 33వ పారిస్‌ రెండు వారాల పాటు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగిన పారిస్‌ ఒలింపిక్‌ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. పారిస్‌కు బై బై.., లాస్‌ ఏంజెల్స్‌కు వెల్‌కమ్‌ అంటూ క్రీడాకారులు సెలవు తీసుకున్నారు. ఫ్రెంచ్‌ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా సాగిన ముగింపు వేడుకలు ఔరా అనిపించాయి. 
 
ముగింపు సందర్భంగా జరిగిన క్రీడాకారుల మార్చ్‌పాస్ట్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని హాకీ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌, యువ షూటర్‌ మను భాకర్‌ చేబూని ముందు నడవగా, మిగతా క్రీడాకారులు వారిని అనుసరించారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ముగింపును పురస్కరించుకుని ఒలింపిక్‌ పతాకాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసి) అధ్యక్షులు థామస్‌ బాచ్‌ తదుపరి ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిచ్చే లాస్‌ ఏంజెల్స్‌ నిర్వాహకులకు అందజేశారు. 
 
చివరిలో అథ్లెట్ల పరేడ్‌ జరిగింది. జులై 26న సీన్‌ నదిలో ప్రారంభమైన విశ్వక్రీడలు ఆగస్టు 11 రాత్రి జరిగిన ముగింపు ఉత్సవాలతో పూర్తయ్యాయి. 14రోజుల పాటు సాగిన ఈ విశ్వక్రీడల్లో 206 దేశాలనుంచి 10.714 క్రీడాకారులు పాల్గొన్నారు. 32క్రీడాంశాలకు గాను 48ఈవెంట్స్‌ జరగ్గా.. మొత్తం 329 స్వర్ణ పతకాలను అందజేశారు. ఈ సారి 84 దేశాలు పతకాల పట్టికలో చోటు దక్కించుకున్నాయి. 
 
117మంది అథ్లెట్లతో పారిస్‌లో అడుగిడిన భారత్‌ కేవలం 6పతకాలకే పరిమితమైంది. గత ఒలింపిక్స్‌ కంటే ఒక పతకం తగ్గడంతో భారత్‌ 71స్థానానికే పరిమితమైంది. ఈసారి భారత్‌కు ఇకే ఒక్క రజత పతకం దక్కింది. ఆ ఒక్కటి నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో సాధించాడు. 
 
10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మహిళల విభాగంలో మను భాకర్‌, 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో మను, సరభ్‌జ్యోతి సింగ్‌ జోడీతోపాటు 50మీ. రైఫిల్‌-3 పొజిషన్‌లో స్వప్నిల్‌ కుశాలే, రెజ్లింగ్‌లో అమన్‌ సెహ్రావత్‌, పురుషుల హాకీజట్టు కాంస్య పతకాలను సాధించింది. ఈసారి షూటింగ్‌లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు దక్కగా.. అథ్లెటిక్స్‌, రెజ్లింగ్‌, హాకీ విభాగాల్లో పతకాలు దక్కాయి. 
 
పారిస్‌ ఒలింపిక్స్‌లో అమెరికా చివరి క్షణంలో ఒక స్వర్ణ పతకం సాధించి పతకాల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. అమెరికా 40స్వర్ణ, 44రజత, 42కాంస్యాలతో సహా మొత్తం 126 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా.. చైనా 40స్వర్ణ, 27రజత, 24కాంస్యాలతో 91 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్‌ 16స్వర్ణ, 26రజత, 22కాంస్యాలతో 64 పతకాలతో 5వ స్థానంలో ఉండగా.. 3వ స్థానంలో జపాన్‌(45), 4వ స్థానంలో ఆస్ట్రేలియా(53) ఉన్నాయి.