ఏపీ స్థానిక సంస్థల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు

ఏపీ స్థానిక సంస్థల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు
స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సమావేశమై ఈ మేరకు తెచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. 
 
అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ శాఖలో అవతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేబినెట్ చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై కేబినెట్ చర్చించింది. భూముల సర్వే రాళ్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వీటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందించనున్నారు.

అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్‌ 217, 144 జీవోలు రద్దు చేసింది. 

రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించాలని, అందుకు చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర ముద్రించాలని కేబినెట్ నిర్ణయించింది.

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని కేబినెట్ అభిప్రాయపడింది. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని విమర్శలు వస్తున్నాయని మంత్రులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తొలగించి, కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ సూచించింది.