ఏపీలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.7226 కోట్లు

ఏపీలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.7226 కోట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇప్పటికే ఈసారి కేంద్ర బడ్జెట్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సాయం చేయనున్నట్లు ప్రకటించింది.  తాజాగా,  రాష్ట్రంలో జాతీయ రహదారుల పనుల కోసం ఈ ఆర్ధిక సంవత్సరానికి రూ.7226 కోట్ల మొత్తం ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువరించింది. 

జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ ద్వారా ఈ మొత్తం ఖర్చు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణ పనుల కోసం కేంద్ర ఉపరితల రవాణామంత్రిత్వ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేసింది. ఇందులో ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ రహదారి పనుల కోసం ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపిన నిధుల వివరాలను ప్రకటించింది. 

దీనిలో మహారాష్ట్ర, బీహార్, యూపీ తర్వాత ఏపీకే రూ.7226 కోట్ల భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. కేటగిరీ వన్ జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు ఖర్చుపెట్టేందుకు మొత్తం 17 రాష్ట్రాలకు రూ.71,112 కోట్ల కేటాయింపుకు కేంద్రం ఎంపిక చేసింది. 

ఇందులో మహారాష్ట్రకు అత్యధికంగా రూ.19023 కోట్ల నిధులు ఖరారు చేయగా, ఆ తర్వాత బీహార్ కు రూ.10720 కోట్లు, యూపీకి రూ.7860 కోట్లు, ఏపీకి రూ.7226 కోట్లు కేటాయించారు. అలాగే కేటగిరీ 2 రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలున్నాయి. ఇందులో తెలంగాణకు రూ.5650 కోట్ల నిధులు కేటాయించారు.