నీట్‌ కన్నా ముందు పీజీ సీట్లను రూ. 13 కోట్లకు అమ్మకం

నీట్‌ కన్నా ముందు పీజీ సీట్లను రూ. 13 కోట్లకు అమ్మకం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని పేర్కొన్నారు. నీట్‌పై రాజ్యసభ ఎంపీ మహ్మద్‌ అబ్ధుల్లా ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్‌ బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చలో నడ్డా జోక్యం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలుత ఆరోగ్య శాఖ మంత్రిగా తన హయాంలో నీట్‌ను తీసుకురాక ముందు వైద్య విద్యలో అవినీతి పెచ్చరిల్లిందని గుర్తుచేశారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా నీట్‌ను ప్రవేశపెట్టే సమయంలో పీజీ సీటు రూ. 8 కోట్లు పలికేదని, రేడియాలజీ వంటి విభాగంలో సీట్లు రూ. 12-13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని ఆయన పేర్కొన్నారు. 

‘‘వైద్య విద్య వ్యాపారానికి అడ్డాగా మారింది. నేను ఆరోగ్య మంత్రిగా ఉంటూ నీట్‌ను తీసుకొచ్చే సమయంలో ఒక్కో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ సీటు రూ. 8 కోట్లకు అమ్ముడైంది. రేడియాలజీ వంటి విభాగాన్ని ఎంచుకోవాల్సి వస్తే రూ. 12 నుండి రూ 13 కోట్ల వరకు ఉండేది” అని నడ్డా తెలిపారు. 

నీట్‌ విధానం అమలుకు ముందు విద్యార్ధులు దేశవ్యాప్తంగా వైద్య పరీక్షల కోసం ప్రయాణించాల్సి వచ్చేదని వివరించారు. సమయం, డబ్బు వెచ్చించడంతో పాటు వైద్య విద్యా వ్యవస్ధలో విద్యార్ధులు అవినీతిని ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. వైద్య విద్యలో సీట్లను బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి వ్యాపారంలా మార్చేశారని చెప్పారు.

“ఒకప్పుడు 30-45 నిమిషాలకు అడ్మిషన్ లిస్ట్ పెట్టేవారు. ఆ తర్వాత విద్యార్థులు రాలేదని, అందుకే ఈ సీట్లను మా ఇష్టానుసారం వినియోగిస్తున్నాం.. అదో వ్యాపారంగా మారింది.. స్వార్థం ఉండేది. ఈ అంశం చాలా కాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది’’ అని నడ్డా గుర్తు చేశారు.  స్వార్ధపర శక్తుల ప్రయోజనాల కోసం వైద్య విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేశారని అన్నారు. కాగా, పేపర్ లీక్‌ కేసులు, నీట్‌ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.