స్మార్ట్‌ఫోన్ల ద్వారా పేదరికం నుండి బైటకు 80 కోట్ల మంది భారతీయులు

స్మార్ట్‌ఫోన్ల ద్వారా పేదరికం నుండి బైటకు 80 కోట్ల మంది భారతీయులు

భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్‌ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తంచేశారు. 

కేవలం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించడం వల్ల గత 6 ఏళ్లలో దాదాపు 80 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. “గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థతో ఏమాత్రం సంబంధమే లేని గ్రామీణ రైతులు, ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్నిరకాల లావాదేవీలను స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోగలుగుతున్నారు” అని ఆయన కొనియాడారు.

ఇప్పుడు గ్రామీణ రైతులు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిటికెలో చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి ఎంతగానో తోడ్పడుతోందని ఆయన తెలిపారు.  బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి తోడ్పడుతోందని చెప్పారు. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలని డెన్నిస్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.

గత 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం డిజిటలైజేషన్​ పైన దృష్టి పెట్టింది. 2016లో నోట్ల రద్దు అనంతరం యూపీఐ డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో మెరుగుదల వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత ఇది మరింత ఎక్కువైంది. బ్యాంకు ఖాతాలను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయడం వల్ల వివిధ పథకాలు, సొంత వ్యాపారాల ద్వారా వచ్చే చెల్లింపులు నేరుగా గ్రామీణ ప్రాంతాల ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. 2023 డేటా ప్రకారం, డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో తొలి ఐదు దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్‌ 29.2 బిలియన్ల పేమెంట్స్​తో రెండోస్థానంలో నిలవగా, చైనా (17.6 బిలియన్ల), థాయ్‌లాండ్‌ (16.5 బిలియన్ల), దక్షిణకొరియా (8 బిలియన్ల) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇక గ్లోబల్‌ రియల్‌టైమ్‌ పేమెంట్స్‌లో భారత్‌ వాటా 46 శాతంగా ఉంది. ఇది టాప్‌ 5లో ఉన్న మిగతా నాలుగు దేశాల వాటాలను కలిపినా ఎక్కువగానే ఉంటుంది. మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభిస్తుండడం వల్ల భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత వేగంగా డిజిటల్‌గా మారుతోంది.