జీవిత, వైద్య బీమా పథకాలపై జీఎస్టీ వద్దు

జీవిత, వైద్య బీమా పథకాలపై జీఎస్టీ వద్దు
* నిర్మలా సీతారామన్‌కు నితిన్‌ గడ్కరీ లేఖ
 
కేంద్ర బడ్జెట్ 2024పై ఇది సామాన్యుల బడ్జెట్ కాదని, కేవలం రెండు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ అంటూ రకరకాల విమర్శలు తలెత్తుతున్న సమయంలో దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ లేఖ రాశారు. జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో ఆయన ఆమెను అభ్యర్థించారు. 
 
నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన మెమోరాండం ప్రకారం ఆర్థిక మంత్రికి లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య జీవిత, వైద్య భీమా  ప్రీమియంపై జీఎస్‌టీ ఉపసంహరణకు సంబంధించిన వ్యవహారంపై యూనియన్ ప్రధానంగా ప్రస్తావించిందని ఆయన పేర్కొన్నారు. ఆ రెండింటిపై పన్ను విధింపు అనేది సరికాదని ఆయన స్పష్టం చేశారు.

కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి, ప్రమాదాల సమయంలో వ్యక్తికి సహాయంగా నిలిచే ప్రీమియంపై పన్నును యూనియన్ వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే వైద్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ అనేది సమజసం కాదని చెప్పారు. ఇదొక సామాజిక అవసరం అని, కాబట్టి జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరారు. 

తనను కలిసిన యూనియన్ జీవిత బీమా ద్వారా పొదుపునకు అవకలన చికిత్స, ఆరోగ్య బీమా ప్రీమియం కోసం ఐటీ మినహాయింపులను తిరిగి ప్రవేశపెట్టడం, పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏకీకరణకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తిందని గడ్కరీ చెప్పారు.

“జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ విధించడం అనేది అనిశ్చితిపై పన్ను విధించడం కిందకే వస్తుంది. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి తీసుకునే జీవిత బీమాపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదు. సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వీటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని యూనియన్‌ కోరుతోంది” అని ఆర్ధిక మంత్రికి వ్రాసిన లేఖలో నితిన్‌ గడ్కరీ వివరించారు.

పై విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రీమియంలపై జీఎస్టీ అనేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా పరిణమించింది కాబట్టి జీఎస్టీ ఉపసంహరణ సూచనను పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రిని నితిన్ గడ్కరీ అభ్యర్థించారు. వాస్తవానికి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. కరోనా  తర్వాత ఈ పాలసీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. 

కానీ, పెరిగిన ప్రీమియంతో చాలా మంది బీమాకు దూరం అవుతున్నారు. జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆరోగ్య బీమా పాలసీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవిత, ఆరోగ్య బీమా అనేవి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాబట్టి వీటికి జీఎస్టీ మినహాయింపును ఇవ్వాలని కోరుతున్నారు.