ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం

ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం
భారత నావికాదళం యుద్ధ నౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముంబైలోని డాక్‌యార్డ్‌లో ఆదివారం సాయంత్రం రీఫిట్ పనులు నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు ఆ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఉన్న ఒక సెయిలర్ జాడ గల్లంతు కాగా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. గల్లంతైన సెయిలర్ కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ముంబై డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు రీఫిట్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన నేవీ సిబ్బంది. ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. 
 
అయితే ఆదివారం సాయంత్రం మొదలు పెడితే మంటలను అదుపు చేయడానికి సోమవారం ఉదయం పట్టిందని అధికారులు వెల్లడించారు. డాక్‌యార్డులో ఉన్న ఇతర నౌకా సిబ్బంది కూడా ఈ రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు.  ఇక భారీ అగ్నిప్రమాదం ధాటికి ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ ఒకవైపు ఒరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
దీంతో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రను మళ్లీ యథాస్థానానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. ఈ ఘటనలో ఒక జూనియర్ సెయిలర్ జాడ గల్లంతు కావడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. మిగితా సెయిలర్లను బయటికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మరమ్మతుల కోసం ముంబై డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రను నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
 
ఐఎన్‌‌ఎస్ బ్రహ్మపుత్రను భారత్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. క్లాస్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర మొట్టమొదటిది కావడం గమనార్హం. ఐఎన్‌‌ఎస్ బ్రహ్మపుత్ర 2000 ఏప్రిల్ నెలలో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. 
 
ఈ నౌకలో 40 మంది అధికారులు, 330 మంది సెయిలర్లు, సిబ్బంది ఉంటారు. వీరిలో ఒక జూనియర్ సెయిలర్ తప్ప మిగిలిన అందరూ క్షేమంగా ఉన్నారని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఆ గల్లంతైన సెయిలర్ కోసం గాలింపు జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రమాదంపై కూడా విచారణ జరుగుతుందని నౌకాదళం తెలిపింది.