
రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. గుడులు కూల్చడంతోపాటు రథాలను కూడా కాల్చారని, ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని ఆమె మండిపడ్డారు.
సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ గతంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ చీకటి పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని ఆమె ధ్వజమెత్తారు. అదేవిధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను కూడా ప్రజలు మరిచిపోరని ఆమె స్పష్టం చేశారు.
తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేస్తున్న ప్రకటనలపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘గతంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇంచుమించు అలాంటి ఎమర్జెన్సీ వాతావరణమే నడిచింది. ఎవరు గళం విప్పినా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు” అంటూ ఆమె మండిపడ్డారు.
“రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి సన్నగిల్లిందేమో. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారం చేపట్టాక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అంతర్వేది రథం కాల్చివేత, పిఠాపురంలో ఆలయ విధ్వంసం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇవన్నీ విధ్వంసం కాదా?’’ అని పురందేశ్వరి ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి చారిత్రక విజయం సాధించిందని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాష్ట్రానికి అందించిన వివిధ ప్రాజెక్టులను వివరించారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఆలోచనలని, మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని మురగన్ గుర్తు చేశారు.
రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లను జమచేస్తూ రెండో సంతకం చేశారని మురగన్ తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సుజనాచౌదరి, ఈశ్వరరావు, పార్థసారధి హాజరయ్యారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!