
నేపాల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదార్ దేవ్బా, బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ను పదవికి రాజీమానా చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రచండ సహకరించాలని సూచించారు. మాజీ గెరిల్లా నాయకుడైన ప్రచండను ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు, అధికార సంకీర్ణ కూటమి భాగస్వామి అయిన సీపీఎన్-యూఎంఎల్ నిర్ణయించుకుంది.
ఇప్పటికే ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలుగతూ మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేశారు. ‘నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్ కలిసి కొత్త ఏర్పాటు చేస్తాయి. కనుక ప్రధాని పదవికి పుష్ప కమల్ దహల్ ప్రచండ రాజీనామా చేయాలి’ అని దేవ్బా స్పష్టం చేశారు.
ఖాట్మండు శివార్లలోని బుధానిలకంఠలో తన నివాసంలో జరిగిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులైన ‘నేపాలీ కాంగ్రెస్’ అధ్యక్షుడు దేవ్బా, ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – యూనిఫైడ్ మార్క్సిస్ట్, లెనినిస్ట్’ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు.
పార్లమెంట్లో మిగిలిన కాలమంతా రోటేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి పదవిని పంచుకునేందుకు పరస్పర అంగీకారానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి బుధవారం సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మద్ధతు ఉపసంహరించుకుంది.
అంతేకాదు ప్రచండ క్యాబినెట్లోని 8 మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో నేపాల్ ఉప ప్రధాని, రవాణా మంత్రులు కూడా ఉన్నారు. వాస్తవానికి సీపీఎన్-యూఎంఎల్ మార్చి 5న ప్రభుత్వంలో చేరింది. దానితో ప్రధాని ప్రచండ అప్పటి వరకు భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ను విడిచిపెట్టారు. అయితే తాజాగా ఆ రెండు పార్టీలు కలిసి, ప్రచండను పదవి నుంచి దించే ప్రయత్నాల్లో ఉన్నాయి.
275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్కు ప్రస్తుతం 89 సీట్లు ఉన్నాయి. సీపీఎన్- యూఎంఎల్ పార్టీకి 78 సీట్లు ఉన్నాయి. దిగువ సభలో 138 సీట్ల మెజారిటీకి, వారి ఉమ్మడి బలం 167 సరిపోతుంది. ప్రచండ పార్టీకి కేవలం 32 సీట్లు మాత్రమే ఉన్నాయి.
More Stories
పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ 8,9 తేదీల్లో భారత పర్యటన
‘సామాజిక భద్రతలో విశిష్ట కృషి’కి ఐఎస్ఎస్ఏ పురస్కారం-2025