
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో అగ్నివీరుల నియామకాలపై ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ఇందులోని లోటుపాట్లను చక్కదిద్దడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. సాయుధ దళాలకు స్వల్పకాలిక సైనికులను నియమించడానికి ఉద్దేశించిన ఈ పథకంలో అవసరమైన సవరణలు తీసుకువస్తామని భాగస్వామ్యపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చింది.
ఈ పథకాన్ని సమీక్షించి యువతను మరింత ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దడానికి చేయవలసిన మార్పులను సిఫార్సు చేసేందుకు కనీసం 10 మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఒక కమిటీని బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ ప్ర భుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ సిఫార్సులు చేయనున్నది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో అగ్నిపథ్ పథకం ప్రతిపక్షాలకు ఒక ప్రచార అస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. ఇటలీలో జరిగే జి7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తిరిగివచ్చిన తర్వాత ఆయనకు తమ సిఫార్సులతో కూడిన నివేదికను కార్యదర్శుల కమిటీ అందచేయనున్నది.
జూన్ 17 లేక18వ తేదీన ప్రధాని మోదీకి దీనిపై సవివర నివేదిక అందచేయనున్నది. నియామక ప్రక్రియలో చేయవలసిన మార్పులతోపాటు ప్రస్తుతం నాలుగేళ్ల కాలం కోసం నియమిస్తున్న అగ్నివీరులకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంపై కూడా కమిటీ సిఫార్సులు చేయవచ్చని తెలుస్తోంది.
భారత సైన్యం కూడా అగ్నిపథ్ పథకంపై అంతర్గత అధ్యయనం చేస్తోందని, ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా అందచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్నివీరుల ఉద్యోగ కాలాన్ని పెంచడం, వారిని సాయుధ దళాలలో కొనసాగించే శాతాన్ని పెంచడం వంటి మార్పులు జరగాలని సైన్యం ప్రభుత్వానికి సూచించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే నాలుగేళ్ల పదవీకాలం తర్వాత సైన్యం కొనసాగిస్తుండగా ఈ శాతాన్ని 60 నుంచి 70 శాతానికి పెంచాలని సైన్యం సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కమిటీ అందచేసే నివేదికతోపాటు సైన్యం నుంచి అందే సూచనలన్నిటినీ సంబంధిత మంత్రిత్వశాఖలతో చర్చించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఓ) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మోదీ ప్రభుత్వం చేపట్టిన మొదటి 100 రోజుల కార్యక్రమంలో అగ్నిపథ్ సమీక్ష కూడా ఉంది. సాయుధ దళాల పెన్షన్ వ్యయాన్ని తగ్గించి సైనిక సిబ్బంది సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో 2022లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో ఈ పథకంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం